రెండు నెలల తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ రేటు మళ్లీ 1 శాతం మేరకు నమోదయ్యింది. దేశంలో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.
కరోనాతో మరో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4.30కోట్లకు చేరాయి. గత 24 గంటల్లో 2,911 మంది వైరస్ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,23,889మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 19,137 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 189కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఫిబ్రవరి 27న దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.11 శాతం ఉండగా మళ్లీ రెండు నెలల తర్వాత ఇప్పుడు రోజువారీ పాజిటివిటీ రేటు 1.07గా నమోదైంది.
టీకాలపై ఎవ్వరిని బలవంతం చేయరాదు
ఇలా ఉండగా, కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నంతకాలం.. టీకాలు వేసుకోనివారిపై ఆంక్షలు విధించరాదని స్పష్టం చేసింది. అంతేకాదు.. టీకాల వల్ల కలిగిన దుష్ప్రభావాలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాక్సిన్లను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టగీ) మాజీ సభ్యుడు డాక్టర్ జాకబ్ పులియెల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అలాగే.. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి దేశంలో పిల్లలు, పెద్దలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల వివరాలను, టీకా దుష్ప్రభావాల సమాచారాన్ని వెల్లడి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కూడా ఆయన తన పిటిషన్లో కోరారు. ముఖ్యంగా.. పిల్లలపై కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు పలు సైంటిఫిక్ జర్నల్స్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయని అందులో పేర్కొన్నారు.
జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్, కేంద్రం, పలు రాష్ట్రాల వాదనలు విన్న అనంతరం.. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ శరీరానికి సంబంధించిన విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు కలిగి ఉంటారని, టీకాలను నిరాకరించే హక్కు కూడా వారికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ను తప్పనిసరి చేస్తూ పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడింది. ప్రజారోగ్య కారణాలతో పౌరులకున్న హక్కులపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందికానీ.. జస్టిస్ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ అధికారం మూడు కారణాలకు లోబడి ఉండాలని గుర్తుచేసింది.