తెలంగాణాలో పార్టీ బలపడాలంటే బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని స్పష్టం చేస్తూ, ఆ విధంగా వస్తే ‘కూర్చీ పోతుందని చూడకండి.. మీ విషయం పార్టీ చూసుకుంటుంది’ అంటూ రాష్ట్రంలోని బిజెపి నేతలకు జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హితవు చెప్పారు. రాష్ట్రంలో పోస్ట్ మాన్ తరహాలో నాయకులు పని చేస్తే సరిపోదని, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడకపోతే ఎలాంటి ఫలితం ఉండదన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి మహబూబ్ నగర్ కు వచ్చిన ఆయన పార్టీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తో సమావేశమవుతూ వారంలో ఒకరోజు ఏదైనా ఒక నియోజకవర్గంలో నాయకులందరూ పర్యటించాలని స్పష్టం చేశారురు. . పది అంశాల ఫార్ములా పెట్టుకుని అందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు.
పార్టీలోకి వచ్చే నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించాలని చెబుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ అవకాశం ఉంటుందని, అధికారంలోకి రాకపోతే ఏం చేయలేమని స్పష్టం చేశారు. ‘నా కంటే బలమైన నేతను పార్టీలోకి తీసుకురావాలి’ అని ప్రతి ఒక్క నాయకుడు అనుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో తాను చేపట్టే పర్యటన సమయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేర్చుకునేలా చూడాలని పార్టీ నాయకులకు నడ్డా దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి మంచి అవకాశం ఉందని చెబుతూ ఇందుకోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను అందరూ కలిసికట్టుగా అమలు చేయాలని చెబుతూ పదాధికారులు బూత్ స్థాయిలో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం చేయాలని చెప్పారు. యువ మోర్చా అధ్యక్షులు వివిధ క్రీడలు, యూత్ అసోసియేషన్ ల సభ్యుల వద్దకు వెళ్లి, మాట్లాడాలని సూచించారు. మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు మహిళా సంఘాలతో తరచూ టచ్ లో ఉండాలని, దళితవాడలను సందర్శించాలని చెబుతూ అక్కడే సగం ప్రజా సమస్యలు తెలుస్తాయని తెలిపారు.
గ్రామాలకు వెళ్లిన ప్రతి నేత కనీసం అరగంట పాటు దళిత కాలనీలో ఉండాలని, లేదంటే చెబుతూ ఆ పర్యటన వృథానే అవుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు.
సీఎం కేసీఆర్ అవినీతి గురించి ప్రజలకు తెలియజేయాలని చెబుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చ పెట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీస్తోందని, దీనిపై ప్రజలకు వివరించాలని సూచించారు.
అన్ని విభాగాల్లో బీజేపీతో సమానమైన పార్టీ ఏది లేదని చెబుతూ కాంగ్రెస్ తో పాటు దేశంలో అన్ని కూడా కుటుంబ పార్టీలే అని గుర్తు చేశారు. ‘అందరూ కలిసి పని చేయండి.. కలుపుకొని పోండి.. పార్టీని బలోపేతం చేయండి’ అంటూ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రణాళిక బద్దంగా పని చేసి, బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ నెల 14వ తేదీన మహేశ్వరంలో సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానుండటంతో భారీగా జన సమీకరణ చేయాలని, పార్టీ పటిష్టత కోసం అందరూ కష్టపడాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు.