గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాలూకూ రెండు నారాయణ, మూడు చైతన్య విద్యాసంస్థలు పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు . వాళ్లే ప్రశ్నాపత్రాలను లీక్ చేసి…ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగే దొంగా..దొంగా అన్నట్లుగా ఉందని మండిపడ్డారు.
అత్యాచారాలంటూ మళ్లీ కొత్త ప్రచారం మొదలు పెట్టారని, నానా హంగామా చేస్తున్నారని, తనపై బురద జల్లే కుట్ర అంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. గురువారం తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో ‘జగనన్న విద్యాదీవెన’ను సిఎం ప్రారంభించారు. మూడో విడత విద్యాదీవెనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10,85,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు.
అనంతరం బహిరంగసభలో విద్యార్థుల తల్లిదండ్రుల ఉద్దేశించి ప్రసంగీస్తూ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిందని ధ్వజమెత్తారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఒక్క అడుగు ముందుకువేస్తే, తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తూ ‘చదువుల విప్లవానికి’ శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు పడిన కష్టాలను తన పాదయాత్రలో ఎన్నో చూశానని, ఈ పథకంతో వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నామని చెప్పారు. వసతి దీవెన, విద్యా దీవెన పథకాల కోసమే రూ. 10,994 కోట్లు ఇచ్చామని తెలిపారు. తమను విమర్శించేవారు ఇప్పటివరకు వారేం చేశారో చెప్పాలని సవాల్ చేశారు.
వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. పిల్లల చదువుల భారం తగ్గించుకోవాలని ఆ ప్రభుత్వం చూసిందని విమర్శించారు. ‘నాడు-నేడు’, ఇంగ్లీష్మీడియం, అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద పథకాల అమలు వల్ల ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.
వచ్చే నెలలో అమ్మ ఒడి కోసం రూ.6,400 కోట్లు వెచ్చించనున్నట్లు జగన్ తెలిపారు. తాము మంచి చేస్తుంటే దొంగల ముఠాకు కడుపు మంటగా ఉందని ఎద్దేవా చేశారు. మహిళల కోసం ‘దిశ’ యాప్ తీసుకొచ్చామని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖలో ఏదో జరిగిపోయిందని నానా యాగీ చేశారని, ఈ నేరాలకు పాల్పడింది టిడిపి నాయకులేనని ముఖ్యమంత్రి విమర్శించారు.