‘‘టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రజాకార్ల సమితి” అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా గురువారం సాయంత్రం మహబూబ్నగర్ లోని ఎంవీఎస్ కళాశాలలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి సర్కారు రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంలా మారిందని చెబుతూ రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇది కేసీఆర్ అవినీతికి మచ్చుతునక అని చెప్పారు. ప్రధాని మోదీ ఆశీస్సులు తెలంగాణ ప్రజల పై ఎప్పుడూ ఉంటాయని పేర్కొంటూ తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని భరోసా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని చెబుతూ కేసీఆర్ కేంద్ర పథకాలను తన పథకాల పేరుతో అమలు చేసుకుంటున్నాడని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ కేంద్ర పథకంతో రాష్ట్రంలో 26 లక్షల మందికి లబ్ధి చేకూరేదని.. కానీ కేసీఆర్ దాన్ని అమలు చేయలేకపోయారని విమర్శించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లుగా పేరు మార్చి అమలు చేస్తున్నారని.. అది కూడా ఇళ్లు సరిగా ఇవ్వకుండా ఇక్కడి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక ఎన్సీడీసీ కింద తెలంగాణలో గొర్రెలు, మేకల అభివృద్ధికి నాలుగు వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర, బహిరంగ సభకు పెద్ద మొత్తంలో ప్రజలు ఆశీర్వదించడానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇది చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
‘‘బీజేపీ భయంతోనే అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు 2023లో ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయం కేసీఆర్కు పట్టుకుంది. ముందే ఎన్నికలు జరిగేలా చేసి కుమారుడిని సీఎంను చేయాలని ఆలోచన చేస్తున్నారు’’ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రాన్ని బద్నాం చేయడమే కేసీఆర్ లక్ష్యమని మండిపడుతూ వరి విషయంలో ఢిల్లీ వచ్చి డ్రామాలు చేసి, గంటలో ధర్నా ముగించారని విమర్శించారు. కేసీఆర్ ఫ్రంట్లు, టెంట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.