కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాటం జరిపి, పట్టభద్రుల నియోజకవర్గం నుండి జరిగిన ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పక్షంకు చుక్కలు చూపించి, సంచలనం కలిగించిన తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్ మరోసారి సందిగ్ధతలో పడింది. ఇప్పటి వరకు తాను తూర్పురా బడుతున్న అధికారపక్షం టి ఆర్ ఎస్ లో చేరబోతున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం పొలిసు కేసులతో వేధిస్తూ, అరెస్ట్ కూడా చేయగా ఎంతో ఆర్భాటంగా బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఆదరించింది. అయితే ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కుమారుడిపై ఇచ్చిన వివాదాస్పద ట్వీట్ విషయంలో బిజెపి ఆయనకు మద్దతు ఇవ్వలేదు.
అప్పటి నుండి క్రమంగా బిజెపికి దూరం జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. బీజేపీ నాయకులు సహితం ఎవ్వరు ఆయన పట్ల ఆసక్తి చూపుతున్నట్లు లేదు.
తన సొంత రాజకీయ అజెండాతో తాజాగా `ప్రజా పాదయాత్ర’ చేయబోతున్నట్లు ప్రకటించడంతో తన దారి తాను చూస్తూకొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి జూన్2 నుంచి ప్రజా పాదయాత్ర ప్రారంభిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
ప్రజా సేవ చేయాలనుకునే వారు తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించి రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా మల్లన్న సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నాయని, తాను మాత్రం ప్రజలను చైతన్యం చేయటానికే పాదయాత్ర చేయనున్నట్టు చెప్పడం గమనార్హం.
పైగా, ఇకపై కేసీఆర్ ను తాను ఒక్క మాట కూడా అననని, రాజకీయాలు చేయనని, ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో పని చేస్తానని తెలిపారు. ఈ మధ్యనే గజ్వేల్లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వ హామీలపై దండెత్తారు.
అన్ని హంగులతో గజ్వేల్లో 100 పడకల హస్పిటల్ కట్టినట్టు చెప్తున్న కేసీఆర్.. తన పంటి నొప్పి చికిత్స కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని మల్లన్న ప్రశ్నించారు. పేదల పిల్లలు సర్కారు బడుల్లో చదువుతుంటే సీఎం మనవడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని ఎద్దేవా చేశారు.
అందరి పిల్లలు సర్కారు బడుల్లోనే చదువుకునేలా వాటిని తీర్చిదిద్దడానికే తన ఉద్యమమని చెప్పారు. సమావేశం తర్వాత కేసీఆర్ ఫాంహౌస్వైపు వెళ్లేందుకు మల్లన్న ప్రయత్నించారు. అయితే పాములపర్తి చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు.
తాను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను చూడటానికి వెళుతున్నానని చెప్పినా వినలేదు. మల్లన్నను పోలీసు వాహనంలో ఎక్కించి ఔటర్ రింగ్ రోడ్డు వరకు తీసుకొచ్చి వదిలేశారు.