ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రతిపక్షాల మధ్య పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సహజంగానే అధికారంలో ఉన్న వైసిపిలో అసహనం కలిగిస్తున్నాయి. వైసిపిని ఓడించడం కోసం వ్యతిరేక శక్తులు ఒకటి కావాలని టిడిపి, జనసేన ఇప్పటికే పిలుపిచ్చాయి. దానితో రాజకీయ శక్తుల పునరేకీకరణ తధ్యం అనే సంకేతాలు వస్తున్నాయి.
వాస్తవానికి 2019 ఎన్నికలు ముగిసిన ఆరేడు నెలలకే బిజెపి జనసేనతో పొత్తు ఏర్పరచుకున్నా రాజకీయంగా ఎవ్వరి దారి వారిదే అన్నట్లుగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ పోరాటాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రీకరిస్తుండగా, బిజెపి నేతలు మాత్రం ఆచరణలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును `ప్రధాన శత్రువు’గా పరిగణిస్తున్నారు.
బీజేపీలో ఒక వర్గం వైసిపి నేతలతో కుమ్మక్కయ్యారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. మరో వర్గం చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నరని, అయితే ఎవ్వరు రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం పట్ల దృష్టి సారించడం లేదని బీజేపీ వర్గాలలో నిస్పృహ వ్యక్తం అవుతున్నది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పేలవమైన ఫలితాలు చూసినదని, నోటాకు మించి పార్టీ ఓట్లశాతాన్ని పెంచుకోలేక పోతున్నదని విమర్శలు కూడా పార్టీ వర్గాల నుండే వినవస్తున్నాయి.
కొద్దీ నెలల క్రితం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా అధికార పక్షం పట్ల పార్టీ నేతల సానుకూల ధోరణి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విధానాలను ఎండగట్టనిదే పార్టీ ఉనికి ఉండదని హెచ్చరించారు. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా, ప్రజా సమస్యలపై నిర్దుష్టంగా పోరాటాలు చేయలేక పోతున్నారు.
దానితో జనసేన తనదారి తాను చూసుకోవాలనే ఆలోచనల్లో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ మధ్య జరిపిన పార్టీ ఆవిర్భావ సదస్సులో రాష్ట్రంలో వైసిపి వ్యతిరేక శక్తులు అన్నింటిని ఒకటిగా చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ద్వారా వచ్చే ఎన్నికలలో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోరాడాలని సంకేతం ఇచ్చినట్లయింది.
ఈ పిలుపు పట్ల టీడీపీ వర్గాల నుండి స్పందన లేకపోయినప్పటికీ బిజెపి వర్గాలు మాత్రం జనసేనతో తప్ప మరే పార్టీతో తమకు పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది. తద్వారా టీడీపీతో పొత్తుకు తామే మాత్రం సుముఖంగా లేమనే సంకేతం ఇస్తున్నారు.
తాజాగా, వైసీపీ అరాచక పాలన అంతానికి మరో ప్రజా ఉద్యమం రావాలని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు పట్ల కూడా బిజెపి ప్రతికూలంగా స్పందించింది.
‘వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలి. ఇందుకోసం ప్రజా ఉద్యమం రావాలి. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అంటూ చంద్రబాబునాయుడు పరోక్షంగా వైసిపి వ్యతిరేకంగా బిజెపి, జనసేన కలసి రావాలని పిలుపు ఇచ్చారు.
ఈ పిలుపును రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వీర్రాజు తిప్పికొడుతూ ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారని.. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించామని అంటూ ఎద్దేవా చేశారు. ‘ఇకపై గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదని ఈ మీడియా వేదికగా స్పష్టంగా చెబుతున్నాం’ అంటూ స్పష్టం చేశారు.
`అభివృద్ది, సంక్షేమం మన దగ్గర ఉంది.. ఈ కుటుంబ పార్టీల కోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. త్యాగధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’ అంటూ టిడిపితో కలిసే ప్రసక్తి లేదని సోము వీర్రాజు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
అయితే, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అధికారం కోసం కాదని పేర్కొనడం ద్వారా పవన్ కళ్యాణ్ భిన్నంగా స్పందించారు. బిజెపితో జనసేన పొత్తు బలంగా ఉందని చెబుతూనే ఎన్నికల సమయంలో మిగతా పార్టీలతో పొత్తు గురించి ఆలోచన చేస్తామని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఏపీ భవిష్యత్ కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన కూడా కోరారు. పొత్తులపై చర్చలు జరగాలని చెబుతూ . ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు పిలుపు గురించి ప్రస్తావిస్తూ టీడీపీ పొత్తుల ప్రస్తావన తీసుకు వస్తే అప్పుడు చూద్దాం అంటూ దాటవేశారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నందున. ఎన్నికల సమయానికి ఎటువంటి అద్భుతం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
కాగా, రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, పొత్తుల విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల వ్యవహారంపై తానొక్కడే మొనగాడని సీఎం జగన్ విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్, వామపక్షాలతో పొత్తులు పెట్టుకోలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.