మాజీ టిడిపి మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ అరెస్ట్ నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మొదట పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో అరెస్ట్ చేస్తున్న చెప్పారు. తెలంగాణ సరిహద్దు దాటగానే ఏపీ రాజధాని భూముల కుంభకోణం కేసులో కూడా అరెస్ట్ చేశామని మాటమార్చారు.
ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని కూడా అధికారులు చూపిస్తున్నారు. ఈ కేసును సోమవారం సాయంత్రమే, ఆయనను రెండో నిందితుడిగా పేర్కొంటూ నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నిందితుడు కావడం గమనార్హం.
పశ్నపత్రాల లీకేజ్ కేసులో వెంటనే బెయిల్ ఇవ్వొచ్చని, అప్పుడు ఈ కేసు కింద అరెస్ట్ చూపాలని ముందుగానే పథకం వేసినట్లు కనిపిస్తున్నది. వారి అసలు లక్ష్యం చివరకు చంద్రబాబు నాయుడుగా వెల్లడి అవుతున్నది.
అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగినట్లు ఇది వరకే ఫిర్యాదులు అందాయి.
ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్ననే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులోఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్ను చేర్చారు.
వీరందరిపైనా సెక్షన్లు 120బీ, 420, 34, 35, 36, 37, 166 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్: 16/2022. 2014-19మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు చేసింది మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే. మొదట్నుంచీ అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఈయనే ఫిర్యాదులు చేయడం, కోర్టులకు వెళ్లడం చేస్తున్నారు.
స్వప్రయోజనాల కోసం రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు వస్తున్నాయి. అలైన్మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఇపిఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్కు లబ్ధి కలిగించారని ఆరోపణలూ ఉన్నాయి.
ఇన్నర్ రింగ్రోడ్డు పొడవు 454 కిలోమీటర్లు కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్రోడ్డు వేశారని ఫిర్యాదులో వైసీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజధానికి వెలుపల లింగమనేని, హెరిటేజ్, జయని ఇన్ఫ్రా భూములు, గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు దగ్గర హెరిటేజ్ భూములు రాజధాని ప్రకటనకు ఐదేళ్ల ముందే భూముల కొనుగోళ్లు చేశారనే ఆరోపణలను కూడా ఆళ్ల ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలోమాల్ ప్రాక్టీస్ నిరోదక చట్టం 408 ఐపిసి కింద నారాయణ విద్యాసంస్థలపై పలు కేసులు నమోదయ్యాయి. మండవల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఇప్పటికే 15 మంది అధ్యాపకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారందరికీ వెంటనే కోర్టు బెయిల్ ఇచ్చింది.
మండవల్లి నుంచి పసుమర్రుకు, అక్కడ నుంచి ఉయ్యూరులోని నారాయణ స్కూలుకు వస్తున్నాయని అప్పట్లో ప్రచారం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో కూడా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ప్రభుత్వం సీఐడీకి ఇచ్చారని సమాచారం.
కాగా.. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్కేసులో నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదయ్యింది. చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు కృష్ణాజిల్లా మండవల్లిలో కేసులు నమోదయ్యాయి. చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబరు 111/2022 కింద కేసు నమోదు అయ్యింది.
కృష్ణాజిల్లా మండవల్లిలో ఈ నెల 2న ఎఫ్ఐఆర్ నెంబరు 141/2022 కింద కేసు నమోదయ్యింది. నారాయణతో పాటు ఆయన సతీమణి రమాదేవి కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇలా ఉండగా, టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. అందులో భాగంగానే మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇతర కేసులపై తన దగ్గర సమాచారం లేదని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.