వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్) నేరపూరితమా, కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చింది. మారిటల్ రేప్ నేరం కాదని పేర్కొంటున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)లోని 375వ సెక్షన్లోని రెండో మినహాయింపును కొట్టివేస్తూ జస్టిస్ రాజీవ్ షక్దర్ తీర్పు ఇవ్వగా, అదే ధర్మాసనంలోని జస్టిస్ హరిశంకర్ ఆ నిబంధన చెల్లుబాటును సమర్ధించారు.
”అర్థం చేసుకోదగిన తేడా” ప్రాతిపదికనే ఇది వుందని వ్యాఖ్యానించారు. ఇరువురు న్యాయమూర్తులు ఇలా భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో ఈ కేసులోని పక్షాలను సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. భారతదేశంలో, మారిటల్ రేప్ను ఏ చట్టం లేదా నిబంధన నిర్వచించలేదు.
పిటిషనర్లు అయిన ఎన్జిఓ రిట్ ఫౌండేషన్, ఐద్వా, మారిటల్ రేప్ బాధితురాలు, ఐపిసి సెక్షన్ 375లోని మినహాయింపును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సవాలు చేశారు. ఈ మినహాయింపు అత్యాచారాన్ని నిర్వచిస్తుంది.
15 సంవత్సరాలు, ఆ పై వయసు గల భార్యతో ఆమె అనుమతి లేకుండా భర్త లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఈ మినహాయింపు పేర్కొంటోంది. 2017 అక్టోబరులో సుప్రీం కోర్టు ఈ వయస్సును 18 సంవత్సరాలకు పెంచింది.
మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలవడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జిఓ మెన్ వెల్ఫేర్ ట్రస్ట్ (ఎండబ్ల్యుటి) తన వాదనలు వినిపించింది. భార్యాభర్తల మధ్య జరిగే లైంగిక చర్యను వివాహేతర సంబంధాలతో సమానంగా చూడరాదని వాదించింది.
దీనిపై మొదటి పిటిషన్ 2015లో దాఖలైంది. ఈ ఏడాది జనవరిలో రోజువారీ విచారణ ప్రారంభమైంది. మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థ అస్తవ్యస్థమవుతుందని కేంద్రం 2017లో తన అఫిడవిట్లో పేర్కొంది. భర్తల వేధింపులకు ఇదొక సులభమైన సాధనంగా మారగలదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో అదనంగా మరో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని పక్షాలతో కేంద్రం విస్తృతంగా చర్చలు జరిపిన మీదటే హైకోర్టుకు సహకరించగలమని తెలిపింది. ఈలోగా దీనిపై విచారణ కార్యకలాపాలను వాయిదా వేయాలని కేంద్రం కోరింది.
దీనిపై తీర్పు ఇచ్చినపుడు ఈ విషయాన్ని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే గృహ హింసచట్టంలో లైంగిక వేధింపులనేవి నేరంగా పరిగణించ బడినందున ప్రస్తుత చట్టంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకుని పరిశీలించనవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.