వారాణసీ లోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది.
ఉత్తరప్రదేశ్ వారాణసీలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును.. అటు హిందూవులు, ఇటు ముస్లింలు తమదేనని వాదిస్తూ వస్తున్నారు. ఈ వివాదం కోర్టులదాకా వెళ్లడంతో వారాణసీ స్థానిక కోర్టు ఈ మసీదులో వీడియో సర్వే చేపట్టాలని ఆదేశించింది.
దీంతో శనివారం నుంచి ఇక్కడ వీడియో సర్వే ప్రారంభంకానుంది. అయితే ఈ సర్వే చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మది వాదనలు వినిపిస్తూ జ్ఞానవాపి మసీదు చాలా పురాతనమైనదని, దీనిలో ఎన్నో ఏళ్ల నుంచి ముస్లింలు పార్థనలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ మసీదులో వీడియో సర్వే చేయాలని వారాణసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని, దీనిపై యథాతథ స్థితి కొనసాగించాలని కోరారు. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ ఈ వివాదం గురించి తనకు ఏమీ తెలియదని, అలాంటప్పుడు ఆదేశాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ఆర్డర్ కాపీలు చదివిన తర్వాత ఆదేశాలిస్తామని చెప్పారు.
ఇంతకు ముందు, జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే కోసం నియమితుడైన కోర్టు కమిషనర్ను మార్చేందుకు వారణాసి కోర్టు గురువారం తిరస్కరించింది. ఈ సర్వేను మే 17 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన రాఖీ సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జడ్జి దివాకర్ ఈ మసీదు సర్వే, వీడియోగ్రఫీ కోసం ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న శృంగార గౌరి, గణేశుడు, హనుమంతుడు, నందీశ్వరులను ప్రతి రోజూ పూజించేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. వీరు గత ఏడాది ఏప్రిల్ 18న కోర్టును ఆశ్రయించారు. ఈ విగ్రహాలకు ఎటువంటి నష్టం చేయరాదని మసీదు కమిటీని ఆదేశించాలని కోరారు. కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రా గత వారం శుక్రవారం ఈ మసీదు వద్ద కొంత వరకు సర్వే చేశారు. అయితే, ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ముస్లింలు ఆరోపించారు. ఆయనను మార్చాలని కోరారు. అయితే కమిషనర్ను మార్చేందుకు కోర్టు తిరస్కరించింది.
కోర్టు కమిషనర్తోపాటు మరో ఇద్దరు న్యాయవాదులు విశాల్ సింగ్, అజయ్ సింగ్ లను కమిషనర్లుగా నియమించింది. 24 గంటల్లోగా మసీదు బేస్మెంట్ను తెరచి సర్వే ప్రారంభించాలని తెలిపింది. మే 17న సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కోర్ట్ ఉత్తరువుల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు సర్వే జరుపుతారు. మే 17 నాటికి సర్వే పూర్తి చేసి, కోర్టుకు నివేదిక సమర్పించమని ఆదేశించింది.
కాగా, సర్వే జరపడానికి ఆటంకాలు కల్పిస్తూ ఉండడం పట్ల కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అటువంటి వారిపై కేసులు నమోదు చేయమని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. మా శృంగర్ గౌరీ స్థల్లో రోజువారీ దర్శనం, పూజకు అనుమతి కోరుతూ 2021 ఆగస్టులో వారణాసిలోని స్థానిక కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వారణాసిలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవి కుమార్ దివాకర్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 26న ఈద్ తర్వాత కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపి మసీదు సముదాయం, ఇతర ప్రదేశాలలో ఆలయ అడ్వకేట్ కమిషనర్ ద్వారా వీడియోగ్రఫీని ఆదేశించింది.
కాగా, జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియో చిత్రీకరణకు వారాణసీ కోర్టు ఆదేశించడం నిస్సంకోచంగా ప్రార్థనా స్థలాల చట్టం-1991ను ఉల్లంఘించడమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇది బాబ్రీ మసీదు టైటిల్ వివాదంలో సుప్రీం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.