ఆర్టికల్ 370 రద్దుతో పాటు నేరుగా కేంద్రమే రెండున్నరేళ్ళకు పైగా పాలన సాగిస్తూ, ఉగ్రవాదంను అదుపు చేశామని, ప్రశాంతత నెలకొందని తరచూ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ కాశ్మీర్ లోయలో తమ ప్రాణాలకు రక్షణ లేకపోయినదని కాశ్మీరీ పండిట్లు బిజెపి నాయకత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా 350 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలను లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు సమర్పించారు.
ముఖ్యంగా ఉగ్రవాదులు తమను లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న హత్యాకాండ పట్ల తిరిగి లోయలో స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని చూస్తున్న పండిట్లలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తమకు భద్రత కరువైపోయిందని వాపోతున్నారు.
తాజాగా, బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్ (35)ను ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్యకు గురికావడంతో పండిట్లలో ఆగ్రహం, భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జమ్ము ప్రాంతానికి చెందిన రాహుల్ భట్ పదేళ్లుగా బుద్గామ్లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం భద్రత దళాలు మట్టుబెట్టిన ముగ్గురు ఉగ్రవాదులతో ఇద్దరు రాహుల్ భట్ ను కాల్చిన వారు కూడా ఉన్నారు.
కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబరు నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో హత్యకు గురైన కాశ్మీర్ పండిట్లలో రాహల్ మూడవ వ్యక్తి. ఈ కాల్పుల ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గతేడాది అక్టోబర్ నుండి కాశ్మీర్లో వరుస దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్లో ఐదు రోజుల్లో ఏడుగురు హత్యకు గురయ్యారు. మృతులంతా కూడా వలసకార్మికులే.
ఏప్రిల్ 4న ఉగ్రవాదులు షోపియాన్ జిల్లాలోని చోటీగామ్ గ్రామంలో బాల్ కృషన్ అనే కశ్మీరీ పండిట్పై కాల్పులు జరిపారు. అంతుకుముందు బిహార్కు చెందిన ఇద్దరు కూలీలు పాతాళేశ్వర్ కుమార్, జక్కు చౌదరిలను పుల్వామా జిల్లాలో చిత్రహింసలకు గురి చేశారు.
శ్రీనగర్లోని ఫార్మసీ యజమాని ఎంఎల్ బింద్రూను హత్య చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు టీచర్లను కూడా హత్య చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించేటపుడు అటెన్షన్లో నిలబడాలని విద్యార్థులను కోరినందుకు ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
అంత్యక్రియల్లో ఆగ్రవేశాలు
రాహుల్ భట్ అంత్యక్రియలు శుక్రవారం జరిగినప్పుడు పండిట్లలో ఆగ్రవేశాలు బహిరంగంగా వెల్లడి అయ్యాయి. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్ పథకంలో భాగంగా ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నారు.
బంటలాబ్ శ్మశాన వాటికలో ‘‘రాహుల్ భట్ అమర్ రహే’’ నినాదాల మధ్య ఆయన మృతదేహానికి ఆయన సోదరుడు సన్నీ అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూలోని ఆయన నివాసం వద్దకు వందలాది మంది కశ్మీరీ పండిట్లు చేరుకుని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పునరావాసం పేరుతో యువ కశ్మీరీ హిందువులను ప్రభుత్వం బలి చేస్తోందని ఆరోపించారు. కశ్మీరు లోయలో శాశ్వతంగా స్థిరపడాలన్న తమ కలలను ఈ సంఘటన దెబ్బతీసిందని తెలిపారు.
కశ్మీరీ హిందువుల ఆగ్రహానికి జమ్మూ-కశ్మీరు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర నేతలు గురయ్యారు. రాహుల్ భట్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఈ నేతలు వచ్చినపుడు కశ్మీరీ హిందువులు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘సిగ్గుపడాల్సిన ఘటన ఇది. ప్రభుత్వాన్ని మేం నిలదీస్తున్నాం. ఇదేనా పునరావాసం అంటే? మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడసలు భద్రత ఏది? మా పని మేం చేసుకోవడానికి వచ్చాం. మమ్మల్ని ఎందుకు చంపడం? మేం చేసిన నేరం ఏంటి? ఇదంతా నిర్వాహక వైఫల్యమే!. ఆందోళనలు వ్యక్తం చేస్తే టియర్ గ్యాసులు ప్రయోగిస్తారా? అంటూ మండిపడుతున్నారు కశ్మీరీ పండిట్లు.
రాహుల్ భట్ బంధువు సూన్ నాథ్ భట్ మాట్లాడుతూ, పునరావాసం, ఉద్యోగ కల్పన పేరుతో యువ కశ్మీరీ హిందువులను చంపించాలని బీజేపీ ఓ ప్రణాళిక రచించిందని ఆరోపించారు. యువ కశ్మీరీ హిందువులు ప్రతిఘటించే సామర్థ్యం లేనివారని, అటువంటివారిని ఉగ్రవాదులు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భగ్గుమన్న నిరసనలు
మరోవైపు, బుద్గాం జిల్లాలో కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు భగ్గుమన్నాయి. రాహుల్ భట్ కు నివాళులు అర్పించడంకు మనోజ్ సిన్హా రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కశ్మీర్ పండిట్ ఉద్యోగులు ప్రదర్శనగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పాటు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు.
అనేక ప్రాంతాల్లో, పండిట్లు తమ తాత్కాలిక క్యాంపులను విడిచిపెట్టి రోడ్లను దిగ్బంధించారు. కేంద్ర ప్రభుత్వం, తమను కాపాడటంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010లో ప్రారంభించిన ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద నాలుగు వేల మందికి పైగా కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక క్యాంపుల్లో నివసిస్తున్నారు.
“ఈ అవమానకరమైన సంఘటనను మేము ఖండిస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, ఇది పునరావాసమా? వారు మమ్మల్ని చంపడానికి ఇక్కడకు తీసుకువచ్చారా? ఇక్కడ భద్రత లేదు,” అంటూ ఓ నిరసనకారుడు రంజన్ జుట్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, తమను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయని మరో నిరసనకారుడు సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
“పరిస్థితి తీవ్రతను చూడండి, ఒక తహసీల్దార్ కార్యాలయం సురక్షితమైన ప్రదేశంగా ఉంది. అతను (రాహుల్ భట్) తన టేబుల్ వద్ద పని చేస్తున్నాడు. అతని శరీరంలో బుల్లెట్లు దూసుకుపోయాయి. అతను పాయింట్-బ్లాంక్గా కాల్చబడ్డాడు. వ్యవస్థ కుప్పకూలింది, భద్రత కుప్పకూలింది. , భద్రత కుప్పకూలింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ భట్ను ఉగ్రవాదాలు కాల్చిచంపడంపై అతని భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణ చేసింది. తన భర్తను చంపేందుకు అతని కార్యాలయ సిబ్బంది ఉగ్రవాదాలతో కలిసి కుట్ర సాగించి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఎవరో తన భర్త గురించి అడిగినప్పుడు అవతల వాళ్లు చెప్పి ఉండకపోతే ఉగ్రవాదులకు రాహుల్ గురించి ఎలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు.
జిల్లా ప్రధాన కార్యాలయానికి తనను బదిలీ చేయాలని పలు సందర్భాల్లో స్థానిక యంత్రాగానికి తన భర్త విజ్ఞప్తి చేశాడని, అయినప్పటికీ అతన్ని బదిలీ చేయలేదని ఆమె వాపోయింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని రాహుల్ భట్ తండ్రి డిమాండ్ చేశారు.
“వచ్చిన వాళ్లు మొదట రాహుల్ భట్ ఎవరని అడిగారు. ఆ తర్వాతే అతనిపై కాల్పులు జరిపారు. ఘటనా స్థలికి 100 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆఫీసులోనూ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ , ఒక్కరు కూడా అక్కడ లేరు. సీసీటీవీ ఫుటేజ్ను చూస్తే అసలు విషయం తెలుస్తుంది” అని ఆయన తెలిపారు.