తరచూ వివాదాస్పద ప్రకటనలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ని బిజెపి సాగనంపింది. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు డా. మాణిక్ సహా (69)ను ముఖ్యమంత్రిగా పట్టం గట్టింది. మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ మార్పు చేయడం గమనార్హం.
గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి శనివారం రాజీనామా అణ్డంచడం, సాయంత్రం కల్లా కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అనేకసార్లు వార్తల్లో నిలిచిన బిప్లబ్పై కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో శాంతి భధ్రలతలను పర్యవేక్షించడంలో సీఎం విఫలమయ్యారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా చేసింది. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు అసమ్మతి సెగ తగిలింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయాలని బిజెపి అధిష్ఠానం భావించినట్లు తెలుస్తున్నది. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి చర్చించారు.
ఈ నెల 13న అమిత్ షాతో భేటీ అనంతరం బిప్లబ్ ఇచ్చిన ట్వీట్లో, కూడా పార్టీ సంస్థాగత అంశాలపై లోతుగా చర్చించామని, తన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించానని చెప్పడం గమనార్హం.
బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేసిన వెంటనే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలు కేంద్ర పరిశీలకులుగా అగర్తలా చేరుకున్నారు. అనంతరం లెజిస్లేచర్ పార్టీ నేతగా డాక్టర్ మానిక్ సహా ఎన్నికయ్యారు.
వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన సాహా.. ఈ ఏడాది త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సాహా 2016లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు.
త్రిపుర అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. 35 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెలేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా ఇటీవల పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీజేపీ బలం 33కు పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కు రెండు స్థానాలు మాత్రమే బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి.