కేసీఆర్ సర్కార్ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తన జీవితంలో ఇంత పనికిరాని అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని ధ్వజమెత్తారు.
ప్రజా సంగ్రామ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రి గద్దె దించడానికో, ఎవరినో గద్దె దించడానికో కాదని, బడుగు, బలహీన వర్గాల సహా అందరి సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర అని అమిత్ షా స్పష్టం చేశారు. అన్నింటికి మించి రజాకార్ల ప్రతినిధులతో చేసిన వారికి వ్యతిరేకంగానే ఈ యాత్ర, అవినీతి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు ఈ యాత్ర అని తెలిపారు.
కేసీఆర్ని ఓడగొట్టడానికి తాను రావాల్సిన అవసరం లేదని బండి సంజయ్ ఒక్కరే చాలని అంటూ కేవలం ఓ పార్టీని దించి మరో పార్టీని అధికారంలో తేవడానికో, ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికో కాదని ఆయన ఆయన స్పష్టం చేశారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం లేదని..దళితులు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం యాత్ర జరుగుతోందని తెలిపారు.
కుటుంబ పాలన కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేయడం జరుగుతోందని చెబుతూ వేలాది కోట్ల అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించడానికి, మజ్లిస్ కి భయపడిన సీఎంను తొలగించేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దళితులను మోసం చేసిన టీఆర్ఎస్ తొలగించాలని స్పష్టం చేశారు.
ఎన్ని రోజులు ఫామ్ హౌజ్ లో ప్రణాళికలు రూపొందిస్తారని, ముందస్తు ఎన్నికలు జరిపించాలని అనుకొంటే దమ్ముంటే రేపే ఎన్నికలు జరిపించాలని షా సవాల్ విసిరారు. ఎన్నికలు త్వరగా జరపాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతూ తాము కూడా వాటి కోసమే ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల నుంచి ధాన్యం కొంటామని, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీల్లో ఏర్పడిన కోతను తొలగించి రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర మంత్రి హామీనిచ్చారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు మంచి చెయ్యదని ఇక్కడ డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఏర్పాటు చెయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో
మజ్లిస్ కి భయపడి కశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తేసేందుకు కేసీఆర్ వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, అయినా ఇంత వరకు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించి.. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సం నిర్వహిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని, ఇలాంటి ప్రభుత్వాన్ని మార్చేందుకే సంగ్రామ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంకా అప్పులు కావాలని అడుగుతున్నారని అంటూ కొడుకు కూతురు లబ్ధి చేకూర్చేందుకేనా ? అని అమిత్ షా ఎద్దేవా చేశారు.
45 డిగ్రీల ఎండలో దాదాపు 760 కిలోమీటర్ల పాటు బండి సంజయ్ నడిచారని అంటూ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు 6359119119 నంబర్ కు మిస్ట్ కాల్ ఇవ్వాలని తెలిపారు. దీంతో బండి సంజయ్ కిలోమీటర్ల యాత్రకు మద్దతు లభించడమే కాకుండా బలం లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారని… కానీ ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ వెళ్లరని, అక్కడకు వెళితే ప్రభుత్వం కూలుతుందని పండితుడు చెప్పడం వల్లనే అక్కడకు వెళ్లడని అంటూ ఎద్దేవా చేశారు. అయితే.. ఇప్పుడా అవసరం లేదని.. ఎందుకంటే తెలంగాణ ప్రజల వల్లే ప్రభుత్వం కూలుతుందని షా స్పష్టం చేశారు.
మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణాలో ఏర్పాటు చేస్తామని..తర్వాత కావాల్సిన బడ్జెట్ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీని ద్వారా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందని అంటూ ఇది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇక రైతుల విషయానికి వస్తే.. లక్షరూపాయల దాకా మాఫీ చేస్తామని చెపి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రతి జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డబులు బెడ్రూం ఇళ్లు విషయాన్ని గుర్తు చేశారు.
దళితులకు బడ్జెట్ అని చెప్పి ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఎస్సీ, ఎస్టీకి 3 ఎకరాల భూమి సంగతి ఏమైందని ప్రశ్నించారు. 30 సెంటీమీటర్ల భూమి కూడా ఇవ్వలేదని, మోదీ పథకాల పేర్లు మార్చడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కేంద్ర పథకాలకు పేర్లు మార్చి కేసీఆర్, ఆయన కొడుకు ఫోటోలు అతికించుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీహాస్పిటల్ కట్టాలి కానీ అవి కట్టకపోగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పరిస్థితిని చెడగొట్టారని ధ్వజమెత్తారు.
మోదీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యదని చెబుతున్నారని, మద్దతు ధర 1940 చేసిందని గుర్తు చేశారు. 11 కోట్ల మంది చిన్న రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వాన్ని దోషిని చేసే ప్రయత్నం చేయకండని టీఆర్ఎస్ పార్టీ నేతలకు కేంద్ర మంత్రి సూచించారు.
ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, చేతకాకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.