గోదావరి జలాలను పొలాలకు తరలించిన `అపర భగీరథుడు’ ,”కాటన్ దొర” అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి మే 15 (1803.). పవిత్ర గోదావరి ప్రవహిస్తున్న జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు 18 వ శతాబ్ది వరకు తాగడానికి నీళ్ళు లేవు. ఒక ఏడు అతివృష్టి, మరొక ఏడు అనావృష్టి. ఏటా గోదావరి వరదలు చేసే బీభత్సం. 1854 వరకూ గోదావరి ప్రజలు పడ్డ ఇక్కట్లు ఇన్నీ అన్నీ కావు.
నేడు ఉభయగోదావరి ప్రజలు పచ్చ పచ్చగా ఉండటానికి, తెల్ల బట్టలు ధరించడానికి, సుష్టుగా భోం చేయడానికి వెనుక పెద్ద గాధ ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే గోదావరిని అదుపులో పెట్టి, ప్రజావసరాలు తీర్చే నదిగా మార్చటానికి మూలపురుషుడు సర్ ఆర్ధర్ కాటన్. ఆయన కేవలం గోదావరి ప్రజలకే గాక అన్నదాతగా భారతీయులకు చిరస్మరణీయుడు
గోదావరి డెల్టా 1831-32 లో అతివృష్టి, తుఫానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింత మందిని పొట్టన పెట్టుకుంది.
1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక, జీవన గతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయిని గా ఉన్న గోదావరిని, ప్రాణహిత గా మార్చిన భగీరథుడుగా ఈ రెండు జిల్లాల ప్రజల గుండెల్లో నిలచి పోయాడు.
పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి తెలంగాణాలో ప్రవహిస్తే భద్రాచలం వద్ద గోదావరి జిల్లాలో ప్రవేశించి రాజమండ్రి పాపికొండల మధ్య ప్రవహించి, ధవళేశ్వరం వద్ద రెండుగా చీలి, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా ప్రవహిస్తున్న గోదావరిని ప్రజలు అనాదిగా పూజించారు. పవిత్రంగా చూశారే గాని, నిస్సహాయంగా ఉండిపోయారు.
1831లో అతివృష్టి,1832లో తుఫాను వచ్చి అల్లకల్లోలం చేయగా 1833లో గుంటూరు కరువు వచ్చి ప్రజల్ని మాడ్చేసింది. ఆ కరువులో తాళలేక గోదావరి- ప్రజల్లో చాలామంది మూటాముల్లె కట్టుకొని దక్షిణాదికి తరలి వెళ్ళారు. ఉన్నవారు లేనివారినే తరతమ భేదం లేకుండా సాగిన ఈ ప్రయాణాల్లో జిల్లా మొత్తం మీద ప్రతి నలుగురిలో ఒక్కరు గతించారు.
ఎంత దారుణమైన కరువంటే ఆడపిల్లల్ని కొందరు హైదరాబాద్ కు అమ్ముకున్నారు. ఊర్లో గుండా ధాన్యం పోవాలంటే పోలీస్ బందోబస్తుతో తప్ప సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం ఏదో పేరుకి చెరువులు త్రవించే పనులు చేయించినా అవి అంతగా ఉపకరించలేదు.
రోడ్లన్నీ శ్మశానాలుగా మారిన నాటి దృశ్యాలు బ్రిటిష్ చరిత్రకారులు సైతం ప్రస్తావించక తప్పలేదు. (మోరిస్ వ్రాసిన హిస్టరీ ఆఫ్ గోదావరి చూడండి.) ఈ కరువు నుండి కొంచెం తేరుకునే సరికి 1839లో మళ్ళీ పెను తుఫాను వచ్చి దెబ్బతీసింది.
గోదావరి ప్రాంతంలో నాడు ప్రత్తి విరివిగా పండించేవారు. మిల్లులు స్థాపించారు. కాని ఇంతకంటే చౌకగా బట్టలు ఉత్పత్తి చేసే పద్ధతుల్ని బ్రిటిష్ వారు కనుగొన్నందున యిక్కడ మిల్లులు మూతపడ్డాయి. దీనితో పత్తి జీవనాధారంగా కూడా పోయింది. ఇంతవరకు మిల్లులపై ఆధారపడేవారు కూడా భూముల్ని అమ్ముకోవాల్సి వచ్చింది.
భూముల ఫలసాయం దైవాధీనం గా ఉన్నది. జిల్లాలో ప్రభుత్వ ఆదాయం కూడా క్షీణించింది. ప్రజలు క్షీణించారు. 1821 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,38,308 అయితే, రెండు దశాబ్దాల తర్వాత 1841 లెక్కల ప్రకారం 5,61,041 అని తేలింది. దీన్ని బట్టి కరువుల బారికి ఎందరు గురైనారో ఊహించవచ్చు.
గ్రామాల్లో అమరకపు వ్యవసాయ పద్ధతి ననుసరించి, భూమి అంతా ఎవరో ఒక పెద్దమనిషి స్వీకరించి, కౌళ్ళకిచ్చి శిస్తు వసూలు గావించి ప్రభుత్వానికి యిస్తుండేవారు. కరువుల వల్ల ఈ విధానానికి ఎవరూ ముందుకు రాని పరిస్దితి..
ఆ పరిస్థితిని పరిశీలించమని మద్రాసు నుండి మౌంట్ మోరి అనే అతన్ని పంపించారు. నన్ను కాదని ఎవరినో పంపిస్తారా అని నాటి బ్రిటిష్ కలెక్టర్ కినుక వహించి అతనికి సహకరించలేదు. అయినా మౌంట్ మోరి పరిస్థితి చూచి ప్రభుత్వానికి నివేదించాడు. ఇది 1844 నాటి గాధ. ప్రభుత్వం కళ్లు తెరిచింది. కరువు నివారణకై ఏం చేయాలో ఆలోచించసాగింది.
ఇలాంటి దారుణ పరిస్థితిలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ప్రాంతానికి వచ్చాడు. అతను అప్పటికే కావేరి నదిని మళ్ళించి తంజావూరు ప్రజలకు సేవలు చేసి ఉన్నాడు. అనారోగ్య కారణంగా విశాఖపట్టణంలో చర్చి నిర్మాణం వంటి తేలిక పనులు చేస్తున్నాడు. ప్రభుత్వ కోరికపై గోదావరి నది ప్రాంతమంతా సర్వే చేశాడు.
సుదీర్ఘమైన నివేదిక సిద్ధం చేశాడు, ఘాటైన మాటలతో ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచాడు. సైన్స్, నాగరికత ఉందనుకునే బ్రిటిష్ వారు పరిపాలిస్తూ కూడా ప్రజల్ని ఈ విధంగా ఉంచడం, నీటిని సద్వినియోగం చేసుకునేటందుకు తోడ్పడకపోవడం గర్హనీయ మన్నాడు.
అప్పటికీ 40 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు గోదావరి ప్రజల సంకటస్థితిని చూస్తూ మిన్నకుండడం క్షంతవ్యం కాదన్నాడు. గోదావరి ప్రాంతమంతా చెరకు పండిస్తే ఎగుమతులు పెరుగుతాయని, ప్రజల ఆదాయం ప్రభుత్వ ఆదాయం పెరిగి ఉభయ కుశలోపరిగా ఉండొచ్చన్నాడు.
1845 ఏప్రిల్ 17న తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాడు. తదనుగుణంగా గోదావరికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడం ముఖ్యం. వరదల బారినుండి పంటల్ని కాపాడటానికి కరకట్టలు వేయటం, పంటలకు ప్రయాణాలకు తోడ్పడే కాలువలు త్రవ్వటం, మురుగు నీటిపారుదల సౌకర్యాలు అమర్చటం, ధాన్యం రవాణా దృష్ట్యా అవసరమైన రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించటం తక్షణ కర్తవ్యాలని పేర్కొ న్నారు.
దీనివలన ఎంత ఖర్చు అయ్యేది, ఏ విధంగా ఆదాయం వచ్చేది అంచనా వేసి చూపాడు. మొత్తం ఖర్చు 1,20,000 పౌండ్లు కాగా, ఒక్క ఆనకట్ట వరకూ 45,575 పౌండ్లు అవుతుందన్నాడు. నాటి పౌండు విలువ పది రూపాయలు. కాటన్ నివేదికను ఇండియాలోనూ, ఇంగ్లండులోనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాగైతేనేమి అతని పథకాన్ని ఆమోదించారు.
గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట పని 1847లో ప్రారంభమైంది. కాటన్ ఛీఫ్ ఇంజనీరుగా పని చేపట్టి, ధవళేశ్వరం వద్ద యిల్లు వేసుకొని నిర్విరామ కృషి చేశాడు. పనివారంతా అతన్ని “సన్యాసి” అనేవారు. నిష్కామకర్మ గా అతను చేస్తున్న పనిని బట్టి వారట్లే పిలిచేవారు.
1847లో ఆనకట్ట ప్రారంభించినది మెదలు 1850 వరకూ 30,54,413 మంది కార్మికులు అక్కడ పనిచేశారు. రోజుకు సగటున 2500 నుండి 3500 మంది కూలీలు ఉండేవారు. ఆనకట్ట నిర్మాణం ప్రారంభించినది మొదలు కాటన్ కు ప్రభుత్వ తోడ్పాటు అంత ఉత్సాహకరంగా లేదు.
సర్వేకు గాను ఒక వెయ్యి పౌండ్లు యిచ్చారు. తొలుత ఆరుగురు ఆఫీసర్లనడిగితే ముగ్గురినే యిచ్చి సరిపెట్టు కొమ్మన్నారు. అదీ అనుభవంలేని వారిని పంపించారు. కాటన్ మొదటినుండీ ఒక వాదన చేస్తూ వచ్చాడు. ఇక్కడ కూలీల చేత పని త్వరగా చేయించవచ్చు, సంవత్సరానికి ఆరు మాసాలు నిర్విఘ్నంగా ఆనకట్ట పని సాగించవచ్చు.
ఆనకట్టతో పాటు వెన్వెంటనే కాలువల తవ్వకం సాగితే గాని,ప్రజలకు ఉపయోగం జరగదు. రైళ్లపై డబ్బు తగలేసే కంటే, నీటి వనరులపై ఆ డబ్బు వినియోగిస్తే అటు రవాణాకు యిటు భూమి అభివృద్ధికీ ఉపయోగపడుతుంది. కనుక ఒక లక్ష పౌండ్ల చొప్పున ఐదేళ్ళపాటు వరుస డబ్బు మంజూరు చేస్తే పనంతా పూర్తి అవుతుంది. ఫలితం ఆశాజనకంగా వుంటుంది, అంటే ప్రభుత్వం పెడచెవిని బెట్టింది.
మొత్తం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి గావటానికి 27 సంవత్సరాలు పట్టింది. ఈలోగా అంచనాలు తారుమారయ్యేవి. కూలీ ధర పెరిగింది. ఇట్లా అంటీ అంటనట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. ఆర్థర్ కాటన్ మాత్రం పట్టుదలతో ఆనకట్ట పని పూర్తి గావించాడు. అప్పుడే ఒక ఏడాది ప్రాయంలో కుమార్తె చనిపోయింది. ఇంట్లోకి ఎప్పుడూ పాములు వస్తుండేవి.
గుట్టలు ప్రేల్చుతుంటే రాళ్ళు యింటి మీద పడుతుండేవి. ఆరోగ్యం అంతంత మాత్రంగా గల కాటన్ ఎండలకి తట్టుకోలేక పోయాడు. ఎండదెబ్బ అతన్ని మంచాన పడేసింది. సెలవు పెట్టి, బాధతో కొన్నాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. తాను వెడుతూ ఓర్ అనే సమర్ధుడైన ఇంజనీరుకు పని అప్పగించి వెళ్ళాడు.
కాటన్ ఉండగానే, 1849లో పెద్ద వరద వచ్చింది. గంటకు 18 అంగుళాల చొప్పున నది పొంగింది. దానితోపాటు సుడిగాలి వచ్చింది. ఆ దెబ్బతో మొత్తం ఆనకట్ట కొట్టుకపోయిందనే భయపడ్డారు. 22 గజాలు గండిపడి ఆ మేరకు కట్ట కొట్టుకుపోయింది. మరొకచోట 44 గజాల గండిపడింది
అయితే వర్షాకాలం ముమ్మరంగా రాకముందే ఆ గండ్లు పూడ్చి ఆనకట్టను నిలబెట్టగలిగారు. మొదటి ఐదేళ్ళు లాకులపై ఖర్చు అవసరం లేకుండా పోయింది. రిపేర్లు కూడా అక్కరబడలేదు. ఆనకట్ట వద్ద కావలసినంత క్వారీ రాయి లభించటం, అడవులనుండి పెద్ద దూలాలు దొరకటం, యిలాంటి సౌకర్యాలన్నీ కాటన్ బాగా సద్వినియోగ పరుచుకున్నాడు.
చేసిన పని సక్రమంగా ఉపయోగపడే నిమిత్తం, శిక్షణ పొందిన నిపుణులను శాశ్వతంగా నియమించమని కాటన్ అభ్యర్థించాడు. 1854 నాటికి ఆనకట్ట పని పూర్తి అయింది. కాటన్ సంతృప్తి పడ్డాడు.గోదావరి ప్రజలు మళ్ళీ తలెత్తుకున్నారు. ఆదాయం పెరిగింది. జనాభా పెరగజొచ్చింది. ప్రభుత్వం కూడా తృప్తి పడింది.
స్థూలంగా చూస్తే ఆనకట్ట పూర్తి అయిన తర్వాత ఏడు లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. జిల్లా ఆదాయం 2,30,000 నుండి 5,70,000కి పెరిగింది. ఎగుమతులు 60,000 నుండి 80,000 పెరిగాయి. 1852లో నర్సాపూర్, అత్తిలి కాలువ త్రవ్వగా ఆ ఒక్క కాలువ క్రిందే, 13 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. 1855 నుండి గోదావరి ప్రజలు కచ్చితంగా చదువులకు సెన్సు చెల్లిస్తూ వచ్చారు.
ఇట్లా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం డెల్టా ప్రాంతాన్నంతటినీ సాగులోకి తెచ్చే ప్రయత్నం వెంటనే తలపెట్టలేదు. 1860లో కాటన్ రిటైర్ అయ్యాడు. 1859లో జిల్లా పరిపాలనలో మార్పులు జరిగాయి. రాజమండ్రి జిల్లా కోస్తా గోదావరి జిల్లాగా మారింది. ఉభయ గోదావరులింకా రాలేదు.
1857 మొదటి స్వతంత్ర సమరం సమయంలో విధ్వంసక చర్యలు జరుగుతాయని, ఆనకట్టలు పాడు చేస్తారని భావించారు. కాటన్ ఇంగ్లండు వెళ్ళిపోయాడు. కథ ఇంతటితో ముగియాల్సింది. అప్పుడు సుఖాంతం గా ఉండేది. అట్లా జరగలేదు.
కాటన్ మొదటినుండీ ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతదేశానికి రైళ్ల కంటె కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని, కాలువలు పంటలకూ,ప్రయాణాలకూ పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించే వారు ఇంగ్లండులో కాటన్ పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాల నివ్వలేదని, దండుగ మారివనీ, కనుక విచారణ జరగాలన్నారు. అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది.
ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలెక్ట్ కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన యీ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి, కాటన్ ను పరీక్షించారు. సర్ జార్జి కాంప్ బెల్ వంటివారు కాటన్ వ్యతిరేకత బాగా చూపారు. ఐనా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికలలో జరిగిన వాదోపవాదలకు సెలక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్.
కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక, ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమయింది. రైలు మార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలనూ కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపారు.
కాటన్ కు చేదోడుగా వీరన్న
పల్లకి ఎక్కిన ప్రభువువలెగాక, తానూ ఒక కూలీగా అందరితో కలసి కష్టించిన ఫలితంగా ఆయనకు మంచి ఆదరణ లభించింది. నిర్మాణపు పనులకు వీణం వీరన్నవంటి ఓవర్సీర్లు కాటన్ కు లభించారు. వీరన్న తరువాత సబ్-ఇంజనీరుగా పైకి వచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్ కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు.
గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్అర్థర్ కాటన్కు చేదోడు వాదోడుగా ఉండి, పదివేల మంది కూలీలను సమీకరించి వారికి, పనిలో శిక్షణనిచ్చి సక్రమంగా వేతనాలిస్తూ ఆదివారం జీతంతో కూడిన సెలవునిచ్చి పని చేయించిన వీణెం వీరన్న నిండు గోదావరికి నిలువెత్తు సేవకుడు.ఈయన బెంగాల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసి,1840 నాటికి రాజమండ్రికి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా చేరారు.
నాలుగేళ్లకు అంటే… 1844వ సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన కాటన్దొరకు సహాయంగా వీరన్నను నియమించారు.1847లో ఆనకట్ట నిర్మాణం మొదలైంది. నాటికి వీరన్న వయసు 53 ఏళ్లు.ఆనకట్ట నిర్మాణానికి పని చేయడానికి గోదావరి జిల్లాల నుంచి శ్రామికులు ముందుకు రాలేదు.
ఆ పరిస్థితుల్లో వీరన్న ఒడిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుంచి వందలాది మందిని తీసుకువచ్చి మంచి వేతనంతో పని చేయించారు. శ్రామికులందరికీ తాత్కాలిక నివాసాలు ఏర్పరచి, కనీస వసతులు కల్పించి, వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. పదివేల మందితో ఐదేళ్ల పాటు సాగిన నిర్మాణంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా నిర్మాణం పూర్తి అయిందంటే అడుగడుగునా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుస్తుంది.
నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో కాటన్ దొర అనారోగ్యం కారణంగా లండన్, ఆస్ట్రేలియాలకు వెళ్ళినప్పుడు ఆనకట్ట నిర్మాణానికి ఎటువంటి అంతరాయం కలగనివ్వకుండా సమర్థవంతంగా పనిచేయించారు వీరన్న.
1852 మార్చి 31వ తేదీకి నిర్మాణం పూర్తయింది. విక్టోరియా రాణికి నివేదిక పంపిన తన డైరీలో కాటన్ ”..వీరన్న అనే మంచివ్యక్తి నాకు లభించకపోయి ఉంటే నేను అనుకున్నట్లుగా ఇంత వేగంగా ఆనకట్ట పూర్తి చేయలేక పోయే వాడిని. వారికి నేను జన్మతః రుణపడి ఉంటాను..’’ సర్ అర్థర్ కాటన్ తన డైరీలో వీరన్నను ప్రశంసిస్తూ రాసుకున్నారు.
వీరన్న శ్రమకు ప్రతిఫలంగా ‘మెర్నిపాడు’ గ్రామ శిస్తును ఆయనకు, ఆయన తర్వాత వారసులకు అందేటట్లు ఈస్టిండియా ఆదేశాలు జారీ చేసింది. 1860లలో మద్రాసు ప్రెసిడెన్సీ కాటన్ దొరతో పాటు వీరన్నను కూడా ‘రాయ్బహదూర్’ బిరుదుతో గౌరవించింది. ఇది రాజబహదూర్కంటే పెద్ద పురస్కారం. వీరన్నకు గోదావరి ఆనకట్ట అంటే ఎంత మమకారం అంటే ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత పదిహేనేళ్ల వరకు ఆయన గోదావరి హెడ్లాక్ వద్ద క్వార్టర్స్లోనే ఎక్కువ సమయం గడిపేవారు.
అధికశ్రమ, ఎండల తాకిడితో పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి ఆయన 1867 అక్టోబర్ 12వ తేదీన మరణించారు. ఆయన అంతిమ కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్లాక్ ప్రాంతంలోనే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన అంతిమ సంస్కారం నిర్వహించిన చోట రాతి గోడకు ఆయన పేరును ఇంగ్లీష్లో చెక్కి గౌరవించింది బ్రిటిష్ ప్రభుత్వం.
పిల్లల పాఠ్య పుస్తకాల్లో గోదావరి ఆనకట్ట – సర్ అర్థర్ కాటన్ పాఠంలో వీణెం వీరన్నను కూడా ప్రస్తావించడం ఎంతైనా అవశ్యం. కాటన్ పేరుతో ‘కాటన్ పేట’ ఉన్నట్లే, వీరన్న నివసించిన వీథికి ‘వీరన్న వీథి’ అని నామకరణం చేస్తే వీరన్నను సముచితంగా గౌరవించినట్లవు తుంది….
నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు “గోదావరి డెల్టా పితామహు”డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు. రిటైర్ అయిన తరువాత 1863లో మరొక్కసారి కాటన్ ఇండియా వచ్చి వెళ్ళాడు. 1899 జులై 14న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరి వాసులకు బంగారు పంటల్ని యిచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కారు.
కాటన్ మ్యూజియం … నిర్లక్ష్యం
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరుమీద ఒక మ్యూజియంను ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటు చేసారు. రెండంతస్తుల భవన మిది. రాతి గోడల కట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. భవనంచుట్టూ ఆవరణలో పూల మొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి.
మ్యూజియం ఆవరణ మీదుగా, మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారి ఫ్లైఒవర్ వంతెన ఉంది. క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్య భవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు.
మ్యూజియంలోని క్రింది గదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికి చెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరి నది రాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణ విశేషాలు, ఎన్ని ఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి.
పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొరఋగారి మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రం ఉంది. కాటన్ వివిధ వయస్సులలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరి నది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలిసే వరకు చూపించే నమూనా కలదు.
విచారించదగ్గ విషయమేమంటే, ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటి మీద దుమ్ము, ధూళి చేరిపోతుంది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు. నమునాలు కూడా చాలా వరకు రంగు వెలసి ఉన్నాయి.వీటిని పురావస్థు చిహ్నాలుగా పరిరక్షించాలి….కాటన్ అమరుడైనా ఆయన కట్టిన ఆనకట్ట అజరామయమయి ఉంది