వచ్చే రెండేళ్లలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయడం కోసం కీలకమైన సంస్థాగత సంస్కరణలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మూడు రోజుల పాటు జరిపిన ‘నవ్ సంకల్ప్ చింతన్ శివిర్’లో చర్చల తర్వాత ఆమోదించబడిన ఉదయపూర్ డిక్లరేషన్లో ఈ సంస్కరణలను వెల్లడించారు.
50 ఏళ్ల లోపు వారికి పార్టీలో విస్తృత ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ , `ఒకే కుటుంబానికి ఒకే సీట్’ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే అందుకు కీలకమైన మినహాయింపులు ఇచ్చారు. కనీసం ఐదేళ్లపాటు పార్టీలో పని చేస్తున్న వారికి ఈ నిబంధనలు వర్తింపబోవని సంకేతం ఇచ్చారు.
కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించేందుకు ఏ వ్యక్తి కూడా ఐదేళ్లకు మించి ఒకే పార్టీ పదవిలో ఉండకూడదని కూడా పార్టీ నిర్ణయించింది. అలాగే అన్ని స్థాయిల సంస్థల్లో 50 ఏళ్ల లోపు వారికి 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ మూడు కొత్త విభాగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించింది. అవి, పబ్లిక్ ఇన్సైట్, ఎన్నికల నిర్వహణ, జాతీయ శిక్షణ.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ముగింపు ప్రసంగంలో, సంస్థాగత సంస్కరణలను ప్రారంభించడానికి ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. టాస్క్ఫోర్స్ కూర్పుపై మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని ఆమె తెలిపారు.
మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించనున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. దాడికి గురవుతున్న భారత రాజ్యాంగం విలువలను పరిరక్షించడానికి, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తి చూపడానికి ఈ యాత్రను చెప్పట్టనున్నట్టు తెలిపారు.
“ఇది చాలా ఉపయోగకరమైన, ఉత్పాదకమైన ‘శివిర్’ అని నేను భావిస్తున్నాను. మీలో చాలా మందికి మీ అభిప్రాయాలను తెలియజేయడానికి, నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో మీ సూచనలను అందించడానికి అవకాశం లభించింది. ప్రతి బృందంలో జరిగిన చర్చల సారాంశాన్ని నేను అందుకున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర, జాతీయ ఎన్నికల కోసం మేనిఫెస్టోలను సిద్ధం చేయడానికి కూడా ఈ సూచనలు విలువైనవిగా ఉంటాయని ఆమె తెలిపారు. అయితే, కొత్త గ్రూప్ సమిష్టిగా నిర్ణయం తీసుకునే సంస్థ కాదని, సీనియర్ సహోద్యోగుల అపారమైన అనుభవాన్ని పొందడంలో తనకు సహాయపడుతుందని ఆమె స్పష్టం చేశారు.
“సంస్థాగత సమూహం నివేదిక చాలా తక్షణ సంబంధితమైనది కనుక నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. దాని ఆలోచనలు కొన్ని ‘ఉదయ్పూర్ నవ్ సంకల్ప్ డిక్లరేషన్’లో భాగంగా రూపొందించాము. వాటిని ఇప్పుడే ఆమోదించాము. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడి సిఫార్సులు త్వరితగతిన అమలు చేయబడతాయి” అంటూ ఆమె భరోసా ఇచ్చారు.
కాగా, జూన్ 15 నుంచి జిల్లా స్థాయిలో రెండో దశ ‘జన్ జాగరణ్ యాత్ర’ను కూడా ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ విస్తృత ప్రచారం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ప్రస్తావిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగం, జీవనోపాధిని నాశనం చేస్తున్న ధరల పెరుగుదల భరించలేనిది అని ఆమె పేర్కొన్నారు.