ప్రధాని నరేంద్ర మోదీ ప్రవచిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రెండు అధునాతన యుద్ధ నౌకలను ముంబయిలోని మజగావ్ డాక్ లో నిర్మించారు. దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌకల పేర్లు సూరత్, ఉదయ్గిరి. వీటిని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం లాంఛనంగా జల ప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, దేశ సముద్ర భద్రత సామర్థ్యాన్ని ఇనుమడింప చేసే క్రమంలో తమ ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతకు ఈ రెండు యుద్ధనౌకలు ప్రతిరూపాలని పేర్కొన్నారు. కరోనా, రష్యా-ఉక్రెయిన్ అంశాలతో యావత్ ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఆత్మనిర్భర్ భారత్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నామని రాజ్నాథ్ వివరించారు.
దేశ సముద్ర సంబంధిత యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సడలని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమే ఈ యుద్ధ నౌకలని చెప్పారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత నావికా దళానికిగల వ్యూహాత్మక అవసరాలను తీర్చడం కోసం కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రెండు యుద్ధనౌకలను ఒకేసారి ఆవిష్కరించడం ఇదే ప్రథమం. అందుకు ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వేదికగా నిలిచింది. కరోనా మహమ్మారి వేధిస్తున్నప్పటికీ నౌకల తయారీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నందుకు మజగావ్ డాక్స్ లిమిటెడ్ ను రక్షణ మంత్రి అభినందించారు.
వీటిలో సూరత్ యుద్ధ నౌక పీ15బీ శ్రేణిలో 4వ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. ఇక, ఉదయ్ గిరి పీ17ఏ తరగతిలో రెండో స్తెల్త్ ఫ్రిగేట్. వీటిని భారత నేవీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ (డీఎన్ డీ) సంస్థ డిజైన్ చేయగా, ముంబయిలోని మజగావ్ డాక్ నిర్మించింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని పర్వత శ్రేణుల పేరును ‘ఉదయగిరి’ యుద్ధ నౌకకు పెట్టారు. ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్స్లో ఇది మూడో నౌక. శివాలిక్ క్లాస్కు చెందిన పి17 ఫ్రిగేట్స్ను మరింత అభివృద్ధి చేసి ఈ నౌకను నిర్మించారని భారత నావికా దళం తెలిపింది.
స్టెల్త్ ఫీచర్స్ను మెరుగుపరిచి, అత్యాధునిక ఆయుధాలు, సెన్సర్లు, ప్లాట్ఫాం మేనేజ్మెంట్ సిస్టమ్స్ను అమర్చినట్లు వివరించింది. గతంలోని లియాండర్ క్లాస్ ఏఎస్డబ్ల్యూ ఫ్రిగేట్కు చెందిన ‘ఉదయగిరి’ సరికొత్త అవతారమే ప్రస్తుత ‘ఉదయగిరి’ యుద్ధ నౌక అని తెలిపింది.