గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. అత్యవసరమైన పరిస్థితుల్లో పార్టీకి అందుబాటులో ఉండాల్సిన తమ నేత విదేశాలకు వెళుతుంటారని పరోక్షంగా రాహుల్గాంధీని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు పూర్తి వివరణతో రెండు పేజీలతో కూడిన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. అలాగే ట్విటర్లోనూ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ తన నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుజరాత్ రాష్ట్ర భవిష్యత్ కోసమే తాను తీసుకున్న ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నానని ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకువచ్చిన సమయంలో హార్థిక్ పటేల్తో భేటీ కాలేదు.
ఈ అంశంపై స్పందిస్తూ తాను అగ్ర నేతలతో సమావేశమైనపుడు వారు రాష్ట్ర సమస్యలను వినకుండా మొబైల్ ఫోన్లలో మాట్లాడతారని, లేదా పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తారని మండిపడ్డారు. గుజరాత్ ప్రజలను వారు విస్మరిస్తున్నారని, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాల అభివృద్ధిపై సరైన వ్యూహ రచన లేకపోవడం వలనే కాంగ్రెస్ను ప్రతి రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారని విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే.
అయితే ఈ వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన హార్థిక్ ఎట్టకేలకు బుధవారం పార్టీని వీడబోతున్నట్లు తానే స్వయంగా ప్రకటించడం గమనార్హం. గుజరాత్ లో గతంలో ఉధృతంగా సాగిన పాటీదార్ ఉద్యమంలో ఓ యువకుడిగా ధ్రువతారవలే వెలిగిన ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికలలో గుజరాత్ లో కాంగ్రెస్ కన్నా బిజెపికి పెద్ద సవాల్ విసిరారు.
ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ చావుతప్పి కన్నులొట్టపడ్డంత పనైంది. కాంగ్రెస్ కు హార్దిక్ పటేల్ మద్దతు ప్రకటించినా ఆ పార్టీ ఎన్నికలలో గెలవలేక పోయింది. బీజేపీని ఆరేళ్లుగా తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన హార్దిక్.. కొద్ది రోజుల క్రితం బీజేపీ నేతలను పొగిడారు. అదే సమయంలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్లకు పోటీ నిలబడేంద రాజకీయ పార్టీలు లేవు. ఆప్ లాంటి పార్టీలు రాష్ట్రంలో ఎదగడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇప్పట్లో ఆ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొనేంత స్థాయిలో లేవు. కాంగ్రెస్ను కాదనుకున్న హార్దిక్.. ఏదైనా రాజకీయ వేదిక ఎంచుకోవాలనుకుంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని అంటున్నారు.