సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో విద్యార్ధులు సైతం భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయడు పిలుపిచ్చారు. దేశంలో విద్యారంగంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి, అందరికీ సమానమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
విద్య, సామాజిక – ఆర్థిక అభివృద్ధి విషయంలో సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడి ఉండడానికి వీలు లేదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన సూచించారు. తమిళనాడులోని నీలగిరి దగ్గర ఉన్న లవ్డేల్ లోని లారెన్స్ పాఠశాలను బుధవారం ఉపరాష్ట్రపతి సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్పునకు అత్యంత కీలకమైన అంశంగా విద్యను అభివర్ణించారు. అది గుణాత్మకమైన ఒత్తిడిని అందిస్తూనే, దేశ అభివృద్ధి వేగానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
భారత్ లో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ళ లోపు యువత ఉన్నారన్న ఆయన, యువజన సామర్ధ్యాన్ని దేశాభివృద్ధి కోసం వినియోగించుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇది భారతదేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన దేశాల్లో ఒకటిగా నిలబెట్టగలదని పేర్కొన్నారు.
భారత దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జాతీయ నూతన విద్యావిధానం -2020 విప్లవాత్మక మార్పులకు నాంది పలకగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది మన దేశంలో విద్యారంగ ముఖచిత్రాన్ని సానుకూల మార్గంలో ప్రభావితం చేయగలదని పేర్కొన్నారు.
జాతీయ అభివృద్ధిలో విద్యా సంస్థలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి ఈ విధానం బాటలు వేసిందన్న ఆయన, పాఠశాలలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఆకాంక్షించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలకు కేంద్రంగా, విశ్వగురువుగా భాసిల్లిన భారతదేశం, మళ్ళీ ఆ వారసత్వాన్ని తిరిగి అందుకునే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
లారెన్స్ పాఠశాల విద్యార్థులు చేపడుతున్న గిరిజన గ్రామాల్లోని నివాసాల పునర్నిర్మాణం, వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్థులకు చేయూత లాంటి అంశాలను అభినందించారు. ఇది భవిష్యత్ లో వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. పాఠశాలలు విద్యార్థుల వ్యక్తిత్వ సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించటం మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.
క్రీడలకు అవసరమైన వాతావరణంతో పాటు సౌకర్యాలను తప్పనిసరిగా అందించాలని సూచించారు. విద్యార్థులు సైతం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలన్న ఉపరాష్ట్రపతి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలని సూచించారు.
విద్యార్థులు తమ జ్ఞానంతో ప్రపంచాన్నే మార్చగలరన్న ఆయన, శక్తివంతమైన నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. రామచంద్రన్, నీలగిరి జిల్లా కలెక్టర్ ఎస్పీ అమృత్, లారెన్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్ కూడా పాల్గొన్నారు.