2024 ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజం కలిగించడం కోసం ఎంతో ఆర్భాటంగా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మూడు రోజుల పాటు జరిపిన `చింతన్ సివిర్’ అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం లేదు. విదేశాలకు వెళ్లారని అంటున్నారు. ఈ లోగా పార్టీలో ఒకొక్క కీలక నేత జారుకొంటున్నారు.
ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడంలో రాజస్థాన్లో జరిగిన మేధోమథనం సమావేశాల ప్రభావం కనిపించడం లేదు. గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఆ పార్టీని వదిలిపెట్టి, విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గల కుటుంభంకు చెందిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ ఆ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరిపోయారు.
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పటిష్ట వ్యూహాలు రచించవలసిన సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళడాన్ని విశ్లేషకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఉదయపూర్ మేధోమథనం సమావేశాల్లో రానున్నలోక్సభ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడానికి రూపొందించిన రోడ్మ్యాప్ ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
తాము కలిస్తే పార్టీ వ్యవహారాలు చర్చించకుండా రాహుల్ మొబైల్ ఫోన్ చూసుకొంటూ గడుపుతారని హార్దిక్ పటేల్ పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ కోటరీ ఇప్పుడు ఓ ముఠాగా మారిందని సునీల్ జక్కర్ ఆరోపించారు.ప్రజలను కులాలవారీగా కాంగ్రెస్ విభజిస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తన మూడేళ్ల రాజకీయ జీవితం వృధా అయిపోయిందని హార్ధిక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు ఏ పనీ అప్పగించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన వాపోయారు.
ఇలా ఉండగా, హర్యానాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ కూడా పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఆయన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖత్తార్ తో సమావేశమయ్యారు. హర్యానా కాంగ్రెస్ కమిటీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడంతో పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది.