జ్ఞాన్ వాపి మసీదు కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్ కు చెందిన అనుభవజ్ఞుడైన న్యాయవాది ఈ కేసులు విచారించాలని ఆదేశించింది. జ్ఞాన్ వాపి మసీదుకు సంబంధించి.. కమిటీ వేసిన పిటిషన్ పై విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది.
జిల్లా జడ్జి ఈ కేసును విచారణ జరిపితే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది.
20 – 25ఏళ్ల అనుభవమున్న వారణాజి జిల్లా జడ్జికి విచారణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పింది. ఆయన నిర్ణయించేంత వరకు హిందూవుల ప్రార్థనలకు అనుమతిపై నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు శివలింగం రక్షణకు, ఈనెల 17న ఇచ్చిన ఉత్తర్వులే అమలవుతాయని స్పష్టం చేసింది.
జ్ఞాన్ వాపి మసీదులో ముస్లింల ప్రార్థనలు కొనసాగుతాయని చెప్పింది. వీడియో గ్రాఫిక్ సర్వేకు ఆదేశిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అంజుమన్ ఇంతెజామియా మసాజిద్ కమిటీ వేసిన పిటిషన్ పై విచారించింది. జ్ఞాన్ వాపి సర్వే కమిటీ నివేదికపై పత్రికలకు లీకులు ఇవ్వొద్దని ఆదేశించింది.
జడ్జి మాత్రమే నివేదికను తెరుస్తారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శాంతిని నెలకొల్పాలన్నదే ప్రధాన ఉద్దేశమని కోర్టు తెలిపింది. దేవాలయ శిథిలాలపై మసీదు నిర్మించారని హిందూ సంఘాల తరఫు న్యాయవాది వాదించారు. శివలింగం రక్షణ.. మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపుపై సుప్రీం ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు హిందూ సంఘాల న్యాయవాది విష్ణు జైన్ తెలిపారు.
అయితే 500 ఏళ్ల నాటి చరిత్రను, ఆనవాళ్లను మార్చే ప్రయత్నం జరుగుతోందని అంజుమన్ ఇంతెజామియా మసాజిద్ కమిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మసీదు పరిసరాల్లో ఉన్నది శివలింగం కాదని.. వాటర్ ఫౌంటెయిన్ మాత్రమేనని తెలిపారు సీనియర్ లాయర్ హుజెఫా అహ్మదీ.