మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం, మాజీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య రాజకీయ వైరం మరింత ఉధృతం అవుతున్నది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్రలోని ఖార్ ప్రాంతంలో నవనీత్ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే ఎం ఎం సి చట్టంలోని సెక్షన్ 475-ఎ ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో ఉద్రిక్తలు నెలకొన్నాయి.
ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం కోర్టులో హాజరుపరుచగా ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ను ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ షరతులను వారు ఉల్లంఘిస్తున్నారని అంటూ దానిని రద్దు చేయమని కోరుతూ ముంబై పోలీసులు కోర్టును ఆశ్రయించారు.