పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభలో సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ రచించిన, కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ప్రచురించిన, “పోలవరం ఎన్నటికి సాకారమయ్యేను!” చిరు పుస్తకాన్ని విజయవాడలో ఆయన ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో కేంద్ర జలవనరుల శాఖ ఉందని ఈ సందర్భంగా వడ్డే ధ్వజమెత్తారు. పెరుగుతున్న ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రమే భరించాలన్నాని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం జాతీయ రహదారుల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది కానీ వ్యవసాయానికి నిధులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి, జాతీయ ప్రాజెక్టు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో నెలకొన్న అనిశ్చితికి కారణం మోదీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని ఈ సభలో ప్రసంగించిన వక్తలు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ అనుబంధాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు.
అఖిల భారత కిసాన్ సభ, అధ్యక్షులు శ్రీ ఆర్.వెంకయ్య అధ్యక్ష వహించారు. ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డా.యన్.తులసిరెడ్డి, సీపీఐ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఏపీ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, టిడిపి మాజీ శాసనసభ్యులు దాసరి బాలవర్ధనరావు, ఏపీ రైతు సంఘం, అధ్యక్షులు వై.కేశవరావు, ప్రత్యేక తరగతి హోదా , విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ, అమరావతి బహుజన జెఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య, అమరావతి రైతు జెఏసి, అధ్యక్షులు పువ్వాడ సుధాకర్, విజయ డైరీ, అధ్యక్షులు చలసాని ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు.
పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తుతో నిర్మాణాన్ని పూర్తి చేసి, 194.6 టియంసిలను నిల్వ చేసి, 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని, 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టు, 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు సాగునీరు సరఫరా చేయాలని గుర్తు చేశారు.
అదే విధంగా, 80 టియంసిలు కృష్ణా నదికి తరలించి, ఆ మేరకు కృష్ణా నదీ జలాలను ఆదాచేసి కరవు పీడిత రాయలసీమ, ప్రకాశం జిల్లాలోని తెలుగుగంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని, విశాఖకు త్రాగు, పారిశ్రామిక అవసరాలకు 23.4 టియంసి సరఫరా చేయాలని ఉద్దేశించారని తెలిపారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని అందించాలన్న బహుళ ప్రయోజనాలు ముడిపడి ఉన్న పోలవరం భవిష్యత్తును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నార్థకం చేస్తున్నాయని వక్తలు తీవ్రస్వరంతో విమర్శించారు.
2020 వరద నీటి ప్రవాహం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం పట్ల వక్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తులపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఏ విధానంలో మరమ్మత్తులు చేయాలి, ఎంత కాలం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఆ వ్యయాన్ని ఎవరు భరించాలి, అన్న అంశాలు అపరిష్కృతంగా ఉండడం వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
మరొక వైపున 41.15 మీ. కాంటూరు వరకు మొదటి దశ అంటూ పరిమితం చేసి, నిర్మాణ పనులను పూర్తి చేసి, ఆ మేరకు నీటిని నిల్వ చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదేపదే చెప్పడం, ఆ మేరకు నిధులను మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, పోలవరం జలాశయంలో డెడ్ స్టోరేజీ నుండి, అంటే 32-35 మీ. మధ్య నిల్వ ఉండే నీటిని తరలించడానికి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పూనుకోవడాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుందని వక్తలు మండిపడ్డారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సాంకేతిక సలహా మండలి ఆమోదించిన మేరకు డిపిఆర్-2 అంచనా వ్యయం రు.55,548 కోట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించి, నిధులను మంజూరు చేయకుండా మోదీ ప్రభుత్వం దగా చేస్తున్నదని, మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి, నిధులను సాధించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వక్తలు తీవ్రంగా ధ్వజమెత్తారు.
అలాగే, శ్రీశైలం జలాశయం వద్ద పెద్ద పెద్ద గోతులు పడ్డాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తున్నదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు, చెయ్యేరు ప్రాజెక్టుల వద్ద వరదలకు కొట్టుకుపోయిన గేట్లను శాశ్వత ప్రాతిపదికన పునర్నించడం, మరమ్మతులు చేయడంలో సహితం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం గర్హనీయమని వక్తలు తూర్పారబట్టారు.