కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ జరపడం దేశంలో విభజన ధోరణులు పెంచుతుందని అంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక వంక తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఈ అంశంపైనే బీజేపీని ఢీ కొనడానికి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై వచ్చే వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
బహుశా ఈ నెల 27న ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమానికి హాజరైన నితీశ్ ను కులాలవారీగా జనాభా లెక్కల సేకరణపై చర్చించేందుకు ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం జరగబోతోందని వార్తలు వస్తున్నాయని విలేకర్లు ప్రస్తావించినపుడు ఈ తేదీన సమావేశం నిర్వహించడానికి చాలా పార్టీలు అంగీకరించాయని చెప్పడం గమనార్హం.
ఈ సమావేశాన్ని నిర్వహించే తేదీ విషయంలో అన్ని పార్టీల సమ్మతి అవసరమని తెలిపారు. బిహార్లో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కులాలవారీ జన గణనపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నితీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బిహార్ శాసన సభ, శాసన మండలి రెండుసార్లు దీనికి అనుకూలంగా తీర్మానాలను ఆమోదించాయని, అందువల్ల ఎటువంటి సమస్య ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కులాలవారీ జన గణనకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకు పడుతున్నాయి.
బీజేపీకి ప్రధానంగా అగ్ర వర్ణాల మద్దతు ఉందని, అందుకే ఓబీసీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి. అయితే తమ పార్టీ కులాలవారీ జన గణనకు వ్యతిరేకం కాదని బిహార్ బీజేపీ నేతలు చెబుతున్నారు.
గత ఏడాది కుల గణన డిమాండ్పై నితీశ్ నేతృత్వంలోని వివిధ పార్టీల నేతల బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఆ సమయంలో నితీష్తో పాటు ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్ ఉన్నారు. ఇటీవలి రోజుల్లో, బీహార్లో కుల గణన, మద్యపాన నిషేధం, శాంతిభద్రతల డిమాండ్ వంటి విభిన్న విషయాలపై బిజెపి, నితీష్ యొక్క జెడి(యు) బహిరంగంగా విభేదిస్తున్నాయి.
బ్రిటీష్ కాలంలో బీహార్, జార్ఖండ్ , ఒడిశా ఒకటిగా ఉన్నప్పుడు 1931లో చివరిగా కుల ఆధారిత జనాభా గణన జరిగింది. కుల గణన ఓబిసిల జనాభాను పెంచుతుందని, సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై ’50 శాతం’ పరిమితిని ఎత్తివేయాలని పిలుపునిచ్చేందుకు దారితీస్తుందని ప్రతిపాదనపై విమర్శకులు పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద రాజకీయ పక్షంగా ఉన్న బిజెపి నాయకులకు తక్కువ సీట్లతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం నచ్చడం లేదు. అందుకనే నితీష్ ను కేంద్రంకు పంపి, తమ పార్టీకి చెందిన వారిని ముఖ్యమంత్రిగా చేయాలనీ కొందరు నాయకులు బహిరంగంగానే కోరుతున్నారు. అందుకు నితీష్ సుముఖంగా లేరు.
మరోవంక, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ బిజెపితో బంధం తెంచుకొంటే నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని సంకేతాలు పంపుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకొని బిజెపిని ఇరకాటంలో పడవేయడం కోసం ఈ మధ్య కాలంలో పలు సందర్భాలలో తేజస్వి యాదవ్ తో నితీష్ కనిపిస్తూ వస్తున్నారు.