పెట్రోల్, డీజిల్ పన్నుల్లో రాష్ట్రాలు తమ వాటాను తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించడం పట్ల తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ తీవ్రంగా మండిపడ్డారు. అధ్వాన్నంగా పనిచేసే వ్యక్తుల నుంచి తమకు డిక్టేషన్ అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని ఏ ప్రభుత్వం దగ్గర లేని అత్యుత్తమ గణాంక ఫలితాలలో ఒకటి మా వద్ద ఉంది. మేము రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల నుంచి దాదాపు రూ.40 వేల కోట్లకు తగ్గించాము. మన ఆర్థిక లోటు కేంద్ర ప్రభుత్వం కంటే సగం. మన తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రెండింతలు. జాతీయ ద్రవ్యోల్బణం 8 శాతంగా ఉన్నప్పుడు మన ద్రవ్యోల్బణం 5 శాతం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.
`మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు. మేము ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మాకంటే అధ్వాన్నంగా పనిచేసే వ్యక్తుల నుంచి మాకు డిక్టేషన్ అవసరం లేదు. ఇతర వ్యక్తులు రాజ్యాంగ విరుద్ధమైన, అధికారికంగా మేము చేయకూడదనుకునే పనులను చేయడాన్ని మేము ఇష్టపడము’ అని ఆయన పేర్కొన్నారు.
అలాగే కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్రాలకు అభ్యర్థన అనే పదం కంటే ప్రబోధం అనే పదాన్ని ఉపయోగించారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పెట్రోల్పై మూడు సార్లు, డీజిల్పై 10 సార్లు సెస్ని పెంచినప్పుడు రాష్ట్రాలను సంప్రదించలేదని గుర్తు చేసారు. పైగా రాష్ట్రాలకు ఇచ్చే వాటాను తగ్గించారని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో కనికరం లేదని, ఏడేనిమిదేళ్లుగా ఇదే పన్ను విధానాన్ని అమలు చేస్తున్నారని చెబుతూ ఇది దారుణం… నయవంచన మాత్రమే అని మంత్రి విమర్శించారు.