ఉదయపూర్ లో జరిగిన కాంగ్రెస్ చింతన్ సివిర్ అనంతరం 2024 ఎన్నికలు లక్ష్యంగా మూడు కీలక కమిటీలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ కమిటీలలో `జి-23′ గా పేరొందిన అసమ్మతి బృందం నాయకులకు కూడా స్థానం కల్పించడం గమనార్హం. రాజకీయ వ్యవహారాల బృందం, టాస్క్ ఫోర్స్-2024 ‘భారత్ జోడో యాత్ర’ను సమన్వయం చేయడానికి సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్ను పార్టీ ప్రకటించింది.
ఉదయపూర్ లో ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని వాదనలు వినిపించిన నేపథ్యంలో టాస్క్ఫోర్స్ లో ఆమెకు స్థానం కల్పించి, రాహుల్ గాంధీకి కల్పించలేదు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు చెందిన బృందంలో గతంలో పనిచేసిన సునీల్ కనుగోలుకు కూడా ఆమెతో పాటు ఈ బృందంలో స్థానం కల్పించారు.
అయితే సోనియాకు సలహాలు అందించే రాజకీయ వ్యవహారాల కమిటీలో రాహుల్ ఉన్నారు. ఆయనతో పాటు ఈ కమిటీలో గులాబీ నబి ఆజాద్ కూడా ఉన్నారు. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, కె.సి.వేణుగోపాల్, జితేంద్ర సింగ్ ఉన్నారు.
టాస్క్ ఫోర్స్-2024లో పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకన్, ప్రియాంక గాంధీ వాద్రా, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, సునీల్ కనుగోలు ఉన్నారు. టాస్క్ఫోర్స్లోని ప్రతి ఒక్కరికి ఆర్గనేజేషన్, కమ్యూనికేషన్, మీడియా, ఔట్రీచ్, ఫైనాన్స్, ఎలక్షన్ మేనేజ్మెంట్కు సంబంధించిన నిర్దిష్టమైన టాస్క్లు ఇవ్వనున్నారు.
కాగా, భారత్ జోడో యాత్రను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసన సెంట్రల్ ప్లానింగ్ గ్రూపులో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలట్, శశిథరూర్, రవ్నీత్ సింగ్ బిట్టూ, కేసీ జార్జి, జోతి మణి, ప్రద్యుత్ బోర్డోలోయ్, జితు పట్వారి, సలీం అహ్మద్ ఉన్నారు. ఎక్స్ అఫీసియో మెంబర్లుగా టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధిపతులు వ్యవహరిస్తారు.