ఒక వంక పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం కోసం, ఎలాగైనా 2024 ఎన్నికలలో తగు ప్రభావం చూపించడం కోసం కాంగ్రెస్ నాయకత్వం సర్దుబాటు ధోరణులు ప్రదర్శిస్తూ కసరత్తు చేస్తుండగా, మరోవంక కీలకమైన నాయకులు వరుసగా ఆ పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు.
గత ఐదు నెలల్లో ఐదుగురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కనీసం వారిని నిలవరించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ నాయకత్వం చేయక పోవడం గమనార్హం.
కపిల్సిబల్ : ప్రముఖ న్యాయవాది, రాజకీయ వేత్త అయిన కపిల్ సిబల్కు అధిష్టానంతో సంబంధాలు చాలా తక్కువ. ఈ నెల ప్రారంభంలో ఉదరుపూర్లో జరిగిన సదస్సుపై స్పందిస్తూ..అధిష్టానం భ్రమలో కొనసాగుతోందని అన్నారు. పార్టీ నాయకత్వంలో సమూల మార్పులు చేపట్టాలంటూ జి-23 నేతలు సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేతల బృందంలో కపిల్ సిబల్ కూడా ఒకరు.
సునీల్ జాఖడ్ : గత నెల పార్టీని వీడిన పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ మాజీ చీఫ్ సునీల్ జాఖడే బిజెపిలో చేరారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నిపై విమర్శలు చేశారంటూ జాఖడ్కు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో ఆగ్రహించిన జాఖడ్ పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వం స్నేహితులు, శత్రువులను గుర్తించాల్సిన అవసరం ఉందని జాఖడ్ పేర్కొన్నారు.
హార్థిక్ పటేల్ : గుజరాత్ పాటిదార్ నేత హార్థిక్ పటేల్ ఈ నెల ప్రారంభంలో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖలో రాహుల్గాంధీపై వరుస విమర్శలు చేశారు. తాను సమావేశమైనపుడు రాహుల్ మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ సమస్యల కంటే నేతలకు చికెన్ శాండ్విచ్లు అందించడంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిలో చేరడం కూడా ఒక ఆప్షన్ అన్న హార్థిక్.. కాంగ్రెస్ కన్నా ఆప్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అశ్వని కుమార్ : నాలుగు దశాబ్దాల అనుబంధం కలిగిన మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వని కుమార్ ఫిబ్రవరిలో పార్టీని వీడారు. ఈ చర్య తన గౌరవాన్ని కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ మరింత అధ: పాతాళానికి దిగజారిపోవడాన్ని చూడవచ్చని అన్నారు.
ఆర్.పి.ఎన్.సింగ్ : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ కేంద్రమంత్రి అయిన ఆర్.పి.ఎన్ సింగ్ పార్టీనీ వీడి బిజెపిలో చేరారు. 32 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్నానని.. కానీ సీనియర్ నేతలకు పార్టీలో విలువ లేదని అన్నారు. గతేడాది జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.