‘‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోపో” అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన అనుచిత వాఖ్య రాజకీయ దుమారం రేపుతున్నది. చంద్రకాంత్ వ్యాఖ్యలపై నెటిజెన్లు బీజేపీయేతర పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. ఓబిసి రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్ థాక్రే సర్కార్ ఓడిపోయిందని బిజెపి ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఎన్ సిపి అధినేత శరద్ పవార్ కుమర్తె, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ, బిజెపి పాలిత మధ్యప్రదేశ్కు ఓబిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ ‘‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఓబిసి రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది’’ అని తెలిపారు.
ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఓబిసి రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్ ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అని సూలేను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
అంతేకాదు, “రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలీదా? మీరు కూడా ఢిల్లీకి వెళ్లండి లేదా నరకానికి వెళ్లండి లేదా ఎక్కడైనా వెళ్లండి కానీ ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి తీసుకురండి’’ అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
పాటిల్ వ్యాఖ్యలపై సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే ‘‘ నా భార్యను చూసి గర్వపడుతున్నాను. ఆమె ఒక గృహిణి, తల్లి. అలాగే.. సక్సెస్ఫుల్ పొలిటీషియన్. బిజెపి నేతలు స్త్రీ ద్వేషులు. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తారనే ఉంటారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళలలో నా భార్య కూడా ఒకరు. చంద్రకాంత్ పాటిల్ మాటలు మహిళలందరికీ అవమానకరమే.’’ అని మండిపడ్డారు.