ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో సిగ్గుతో తలదించుకునే స్థితికి తెచ్చే ఒక్క పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా తాను తలవంచుకునే కారణం ఒకటి కూడా లేదని భరోసా ఇచ్చారు. దేశ ప్రజలకు సేవకుడిగా వ్యవహరిస్తానని చెప్పానని, ఈ క్రమంలో తాను శక్తివంచన లేకుండా పనిచేశానని ప్రకటించారు.
ప్రజలు సిగ్గు పడే పరిస్థితిని తానెప్పుడూ తీసుకురాలేదని గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలోని అట్కోట్ పట్టణంలో 200 పడకల మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ను ప్రారంభిస్తూ తెలిపారు. దేశ ప్రజలు సగర్వంగా నిలిచేలా చేసేందుకు పాటుపడ్డామని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఎనిమిదేళ్ల తమ పాలనలో తాను ఎటువంటి తప్పిదాలు చేయలేదని, పైగా ఇతరులు చేయడానికి కూడా అవకాశం కల్పించలేదని తేల్చి చెప్పారు. జనం సిగ్గుపడితే పాలకుల తప్పిదం అవుతుందని స్పష్టం చేశారు. దీనిని గుర్తులో పెట్టుకునే తాము వ్యవహరించామని వెల్లడించారు.
తాను ఈ స్థాయిలో ఉండడానికి గుజరాతే కారణమని ప్రధాని మోదీ ప్రజల సమక్షంలో ప్రకటించారు. అందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గుజరాత్ ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదని అంటూనే.. యూపీఏ సర్కారు తీరును ఈ సందర్భంగా ప్రధాని ఎండగట్టారు.
స్వతంత్ర భారతం ఏ విధంగా ఉండాలనేది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలు కన్నారని, ఈ కలల భారత నిర్మాణానికి తాము నిజాయితీ విశ్వసనీయతతో కృషి చేశానని ప్రధాని వివరించారు. పేదల అభ్యున్నతే లక్షంగా తమ ప్రభుత్వం కదలిందనిచెప్పారు.
పలు పేదల అనుకూల పథకాలను తీసుకురావడం ద్వారా తాము దేశ పేద ప్రజానీకానికి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా పేదలకు సాయం అదే విధంగా చూశామని తెలిపారు. కరోనా దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించిందని, పలు చిక్కులను తెచ్చిపెట్టిందని ప్రధాని గుర్తు చేశారు.
ఈ దశలో కూడా తమ ప్రభుత్వం క్రమం తప్పకుండా విధిగా పేదలకు ఆహారధాన్యాలను సరసమైన ధరలకు అందించిందని, ఇందులో ఉచిత కోటా కూడా ఉందని గుర్తు చేశారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు కరోనా టీకా డోస్లు పొందే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.