’పోయి ఇంట్లో వంటవండుకో’ అని ఎన్ సిపి నాయకురాలు సుప్రియ సూలేను అన్నందుకు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చివరికి క్షమాపణ చెప్పినట్లు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలి చకంకర్ తెలిపారు. తాము నోటీసు ఇవ్వడంతో ఆయన క్షమాపణ చెప్పినట్లు వివరించారు.
చంద్రకాంత్ పాటిల్ క్షమాపణ చెప్పిన తర్వాత సుప్రియా సూలే స్పందిస్తూ, ‘‘నేను ఆయన అన్న ఆ రోజు నుంచే దుమారానికి దూరంగా ఉన్నాను. అయినా ఆయన పెద్ద మనస్సు చేసుకుని క్షమాపణ చెప్పారు. ఇంతటితో దీన్ని ఇక్కడే ఆపేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
అంతకు ముందు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారంత్ బిజెపి నేత వాఖ్యాలను ఖండించారు. భారత రాజకీయాల్లో లైంగికత్వ ధోరణి విపరీతం అవుతోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇక డిఎంకె ఎంపీ కనిమొళి అయితే పబ్లిక్ ప్లాట్ ఫారాల్లో మహిళలను కించపరచడానికి వ్యతిరేకంగా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళితే, చంద్రకాంత్ పాటిల్ బుధవారం ఓబిసి రిజర్వేషన్ అంశంపై నిరసన తెలుపుతున్నప్పుడు సుప్రియా సూలేను ఉద్దేశించి, ‘‘నువ్వు(సూలే) రాజకీయాల్లో ఎందుకు ఉన్నావు? ఇంటికి పోయి వంట వండుకో. ఢిల్లీ కన్నా వెళ్లు లేక స్మశానానికన్నా వెళ్లు. కానీ ఓబిసి కోటాను తీసుకురా. లోక్ సభ సభ్యురాలివై ఉండి కూడా ఓ ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ పొందడం ఎలాగో తెలియదా? ’’ అంటూ నిప్పులు చెరిగారు.
అంతకు ముందు, మహారాష్ట్రలోని ఓబీసీలకు సైతం విద్యా,నిరసన వ్యక్తం చేస్తుండగా, మహారాష్ట్రలో కొనసాగుతోన్న ఈ నిరసనను మధ్యప్రదేశ్తో పోల్చారు సుప్రియ సూలె. ఈ నేపథ్యలో రాష్ట్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఎవరినో కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు ప్రారంభమైంది’’ అని అన్నారు. దీనిపై చంద్రకాంత్ ఘాటుగా స్పందించారు.