ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకులు సిద్ధూ మూసేవాలా (28) దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలోని జహవర్కే గ్రామంలో ఆదివారం ఈ హత్య జరిగింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళుతుండగా, మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు సిద్ధూను తుపాకీతో కాల్చి చంపారు.
ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. రాష్ట్రంలోని ప్రముఖులకు పోలీసు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మూసేవాలా వాహనంపై నిందితులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుల్లెట్ గాయాలతో ఆయన తన సీటుపైనే కుప్పకూలారు.
వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సిద్ధూ మృతిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వదిలిపెట్టమని తెలిపారు. సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్దీప్ సింగ్ సిద్ధూ గతేడాది డిసెంబరులో కాంగ్రెస్ చేరారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. సిద్ధూ హత్యపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ హత్యకు సిఎం, డిజిపిలే బాధ్యులని పంజాబ్ కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని విమర్శించింది.