మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై చెప్పులు, రాళ్లతో దాడి జరగడం రాజకీయ కలకలం రేపుతున్నది. పోలీసుల రక్షణతో ఆయన ఆ దాడి నుండి బయటపడినా, సోమవారం ఉదయం స్పందిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను చంపాలని ఇదంతా చేయించారని మల్లారెడ్డి సంచలన ఆరోపణ చేశారు.
సింహగర్జన సభలో తనపై దొంగ చాటుగా రేవంత్ రెడ్డి దాడి చేయించారని ధ్వజమెత్తారు. రెడ్డీల ముసుగులో రేవంత్ మనుషులు తనపై దాడి చేశారని మండిపడ్డారు. తనను హతమార్చేందుకు రేవంత్ చేసిన కుట్ర ఇది అని స్పష్టం చేశారు. తనపై రెడ్డీలెవరు దాడి చేయలేదని.. రేవంత్ రెడ్డి ఉసిగొల్పిన గుండాలే తనను చంపాలని చూశారని మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి వల్ల తాను గత ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అతని వేధింపులకు తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ భరించడం తన వల్ల కావడం లేదని అంటూ రెడ్డి సింహగర్జన సభకు తానే అనుమతి ఇప్పించానని తెలిపారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తనపై దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిపై కేసు పెడతానని, జైలుకు పంపిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అక్రమ దందాలు బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుట్రలన్ని బయటి పెడతానని హెచ్చరించారు.
ఆదివారం రాత్రి మంత్రి తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్ను, టీఆర్ఎ్సను పదే పదే పొగుడుతూ మాట్లాడటంపై సభికులు మండిపడ్డారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.
రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడ్డి కార్పొరేషన్ ఏమైందని సభికులు ఆయనను ప్రశ్నించారు. దళిత బంధు గురించి ఇక్కడెందుకు అంటూ జేఏసీ నాయకులు వేదికపైనే మంత్రిని చుట్టుముట్టి ప్రశ్నించారు.పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయ్నతం చేశారు.
మంత్రి వేదిక దిగుతుండగా.. పలువురు అక్కడికి దూసుకువచ్చి మల్లారెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి వాహనం వెంట పరుగులు తీస్తూ వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసిరారు. ఎట్టకేలకు పోలీసులు భారీ భద్రత నడుమ మంత్రిని అతికష్టమ్మీద అక్కడి నుంచి పంపించేశారు.