24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌజ్ లోనే ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుని 40 గ్రామాలకు సరిపడా విద్యుత్ ను ఉచితంగా వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బహిరంగ మార్కెట్ లో యూనిట్ కరెంట్ ధర 3 రూపాయలకు దొరుకుతుండగా కేసీఆర్ మాత్రం కమీషన్లకు కక్కుర్తి పడి యూనిట్ కు రూ.6 చొప్పున విద్యుత్ కొంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డాయిరు. రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను తనఖా పెట్టి అప్పు తీసుకున్న కేసీఆర్ రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేశారని దయ్యబట్టారు.
అదానీ కంపెనీకి కట్టబెట్టేందుకే బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలేనని స్పష్టం చేశారు. కాలుష్యం పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం మూసివేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సంజయ్ విమర్శించారు.
ఎరువుల ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఎరువుల ఫ్యాక్టరీని మూసివేయించి రైతులకు నష్టం చేసే చర్యకు పూనుకున్నారని సంజయ్ ఆరోపించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్ఎస్ నేతలు ఎంతోమంది యువకుల నుండి కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పారు.
వాళ్లందరికీ ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వారంతా తిరగబడుతున్నారని గ్రహించి కాలుష్యం పేరుతో ఏకంగా ఫ్యాక్టరీనే మూసివేయించడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే… వాళ్లు దాచుకున్న డిపాజిట్లను కూడా డ్రా చేసి ఆ డబ్బుతోనే కార్మికులకు జీతాలు చెల్లించే స్థాయికి కేసీఆర్ దిగజారారని మండిపడ్డారు.
బొగ్గు దిగుమతి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి తనను తాను కాపాడుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుతో కేసీఆర్ ప్రభుత్వంపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసి వాళ్ల ద్రుష్టిని మళ్లించేందుకు కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు కేసీఆర్ తెరదీసిండని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ విచ్చలవిడి అవినీతితో రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిండని మండిపడుతూ జీతాలు, పెన్షన్ లు ఇచ్చే పరిస్థిలేదు. ఆగమాగమైంది. ఏ రోజు ఏమైతదో తెల్వని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని, బయట అప్పులు కూడా పుట్టే దిక్కులేదని విమర్శించారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ పెద్ద కుంభకోణం అంటూ ఇండియా బుల్స్ అనే కంపెనీ వర్కవుట్ కాదని ఆ ప్లాంట్ కు సంబంధించి తుప్పుపట్టిన మెషీన్ ను వదిలేసుకుందని తెలిపారు. ఆ తుప్పుపట్టిన యంత్రాన్ని తీసుకొచ్చి వేల కోట్లు వెచ్చించి భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టి బినామీ వ్యక్తులకు పని అప్పగించారని సంజయ్ ఆరోపించారు.
కాగా, 8 ఏళ్ల మోదీ సేవా సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ పేరుతో ఈనెల 14 వరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సంజయ్ వెల్లడించారు. ఈరోజు దీనికి సంబంధించిన ప్రత్యేక బుక్ లెట్, ప్రత్యేక గీతాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆవిష్కరించారని చెప్పారు. 5 జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.