కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ బీజేపీలో చేరడానికి రంగం సిద్దమైన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని పరాజయం అంచు వరకు తీసుకెళ్లిన అతను ఇప్పుడు అదే పార్టీలో చేరడానికి ప్రధాన కారణం అతనిపై బిజెపి ప్రభుత్వం నమోదు చేసిన రెండు దేశ ద్రోహం కేసులతో పాటు సుమారు 30 క్రిమినల్ కేసులే అని తెలుస్తున్నది.
ఆ కేసులు ఉన్నంత వరకు తాను ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో, ఆయా కేసులను ఉపసంహరించుకునే షరతుపై బీజేపీలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. వాస్తవానికి గత వారం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించిన సమయంలోనే ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతారని కున్నారు. అయితే కేసుల చిక్కుముడి వీడక పోవడంతో జాప్యం జరుగుతున్నట్లు భావిస్తున్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికలలో కనీస వయస్సు లేక పోటీ చేయలేక పోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో క్రిమినల్ కేసుల కారణంగా పోటీకి వీలు కాలేదు. పోటీపై గల నిషేధం తొలగించుకోవడానికి సుప్రీం కోర్ట్ వరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దానితో బీజేపీలో చేరడం తప్ప గత్యంతరం లేక పోయింది.
గుజరాత్ లో కాంగ్రెస్ కుమ్ములాటలతో బలహీనంగా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాలలో తగ్గుతున్న ఆదరణ బీజేపీని కలవరంకు గురిచేస్తున్నది. ఆ లోటును గ్రామీణ ప్రాంతాలతో పాటీదార్లు, గిరిజనులతో పూరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల అనంతరం ప్రధాని గత మార్చ్ నుండి 17 సార్లు గుజరాత్ లో పర్యటించారు. బహుశా ఆయన ప్రధాని హోదాలో ఇప్పటి వరకు మరే రాష్ట్రంలో ఇంత తరచుగా పర్యటించడం లేదు.
తన సొంత కులానికి రేజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ప్రముఖునిగా వెలుగొందుతున్న హార్దిక్ పటేల్ `కులతత్వ’ పార్టీ అని ఆరోపిస్తూ కాంగ్రెస్ నుండి బైటకు రావడం చూస్తే తన రాజకీయ భవిష్యత్ పట్ల ఎంతగా ఆత్రుతతో ఉన్నారో వెల్లడవుతుంది.
పైగా. గత మూడేళ్లుగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా.. తనకు పని లేదని, కాంగ్రెస్ గుజరాతీ వ్యతిరేకి అని, కాశ్మీర్ విలీనానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని, గుజరాతీలిద్దరినీ కాంగ్రెస్ ఎప్పుడూ విమర్శిస్తున్నదని అంటూ పొంతనలేని విమర్శలు గుప్పిస్తున్నారు. అతని విమర్శలు రాజకీయ వర్గాలలో వినోదం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ లో తనకు పనిలేదని గ్రహించడానికి మూడేళ్లు పట్టిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
బీజేపీలో చేరే విషయంలో రాష్ట్రాల్లోని నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రధాని కార్యాలయం వారితోనే నిత్యం సంప్రదింపులతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో హార్దిక్ పటేల్ ను వెంటాడుతున్న మరో భయం ఉంది. పాటీదార్లలో మంచి ఇమేజ్ గల ఖోడల్ధామ్ ట్రస్ట్ ఛైర్మన్ నరేష్ పటేల్ కాంగ్రెస్లో చేరవచ్చని మీడియాలో కథనాలు రావడంతో ఆందోళన చెందడం ప్రారంభించారు.
రిజర్వేషన్ కోసం పాటిదార్ల ఆందోళన కారణంగా 2016లో పాటిదార్ మహిళా ముఖ్యమంత్రి (ఆనందిబెన్ పటేల్) ను బిజెపి బలవంతంగా గద్దె దించవలసి వచ్చింది. ఆ కోపంతో 2015లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన విస్నగర్ అల్లర్లు, దహనం కేసులో హార్దిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం ఆ తీర్పుపై స్టే కోసం హైకోర్టు తీర్పును ఆశ్రయించారు.
ఇంతలో, 2019 లోక్సభ ఎన్నికలలో జామ్నగర్ నుండి పోటీ చేయాలని భావించి కాంగ్రెస్లో చేరాడు. నామినేషన్ల దాఖలుకు కొన్ని రోజుల ముందు అతని అప్పీల్ హైకోర్టు లో తిరస్కరణకు గురైంది, సుప్రీం కోర్ట్ జోక్యంపై సమయం లేకపోవడంతో నామినేషన్ వేయడం సాధ్యం కాలేదు.
ఈ కేసు సందర్భంగా, గుజరాత్ ప్రభుత్వం హార్దిక్పై నమోదైన రెండు దేశద్రోహం కేసులతో సహా 17 ఎఫ్ఐఆర్లతో పాటు అతనిపై నేర చరిత్ర ఉందని పేర్కొంటూ స్టేకు వ్యతిరేకంగా బలమైన కేసును రూపొందించింది. హైకోర్టు ప్రభుత్వ వాదనను సమర్థించడంతో పోటీ చేయలేకపోయాడు. అక్కడితో అతని రాజకీయ యాత్ర ఆగిపోయింది.
ఈ ఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోవడానికి సిద్ధంగా లేడు. అయితే అందుకు ఒక సమస్య ఉంది. 2015 నుండి 2018 మధ్య కాలంలో అతనిపై నమోదైన దేశద్రోహంతో సహా కనీసం 30 ఎఫ్ఐఆర్లలో అతను నిందితుడు.
హైకోర్టులో వలే ఇప్పుడు సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం అతని నేర చరిత్రపై గట్టిగా వాదనలు వినిపించక పోవడంతో ఏప్రిల్ 12న అతనికి కింది కోర్ట్ విధించిన శిక్షపై స్టే ఇచ్చి, అతని అప్పీల్ పై నిర్ణయం పెండింగ్ లో ఉంచింది. దానితో ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేయడానికి మార్గం ఏర్పడింది.
ఆ తర్వాత, ఏప్రిల్ 25న, రాష్ట్ర ప్రభుత్వం అతనిపై, ఇతరులపై అల్లర్లకు సంబంధించిన మరొక కేసును ఉపసంహరించుకోవాలని ప్రయత్నించింది. అయితే అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించారు. మే 10న ఉపసంహరణకు అనుమతినిస్తూ ప్రభుత్వం సెషన్స్ కోర్టు తలుపులు తట్టింది. అప్పటి నుండి కాంగ్రెస్ ను విడిచి, బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యాడు.
ఆయనను రాష్ట్రంలో బిజెపి నాయకులు ఏ విధంగా స్వీకరిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాటిదార్ల ఉద్యమం కారణంగా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన ఆనందీబెన్ పటేల్కు ఇప్పటికి ఆ పార్టీలో గణనీయమైన అనుచరులు ఉన్నారు. వారు అతనిని అంత తేలికగా వదిలివేసే అవకాశం లేదు.