ఆఫ్రికాఖండ సర్వతోముఖాభివృద్ధిని భారతదేశం ఆకాంక్షిస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ఆఫ్రికాతో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ప్రయత్నిస్తోందని చెబుతూ ఆఫ్రికాలో వైద్య రంగంతో పాటు డిజిటల్, హరితాభివృద్ధి విషయంలో భారత్ అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
గబాన్ లో ఉన్న భారతీయ సంతతి ప్రజలు, వ్యాపావేత్తలతో వెంకయ్యనాయుడు నేతృత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆఫ్రికా పురోగతిలో భారతదేశం తన పాత్రను సుస్పష్టంగా పోషిస్తుందని పేర్కొన్నారు.
ఇందుకోసం ఆఫ్రికా-భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.2021-22 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలోనూ గబాన్-భారత్ మధ్య బిలియన్ డాలర్ వాణిజ్యం జరిగిందని చెబుతూ దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గబాన్ యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే విషయంలో భారతదేశం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని వెంకయ్య నాయుడు నాయుడు హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలోనూ అవసరమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా గబాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (జీఎస్ఈజెడ్) ను భారతీయ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జీఎస్ఈజెడ్ లో 54 భారతీయ కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని అధికారులు ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.
గబాన్ లో భారతీయ సంతతి ప్రజల కారణంగా ఇక్కడ మన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగుతుండటాన్ని ఆయన అభినందించారు. భారతదేశాన్ని మళ్లీ విశ్వగురుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో విదేశాల్లోని భారతీయ సంతతి ప్రజల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి కొనియాడారు.
భారతీయ సంతతి ప్రజలు, వ్యాపారవేత్తలతో సమావేశం, జీఎస్ఈజెడ్ సందర్శనలో ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఎంపీలు సుశీల్ కుమార్ మోదీ, విసయ్ పాల్ సింగ్ తోమర్, పి.రవీంద్రనాథ్, పాల్గొన్నారు.