గత పాలకుల అవినీతి, అక్రమాలతో అడుగంటిన భారత ప్రతిష్టను తన పాలనా దక్షతతో ఆకాశమంత ఎత్తున నిలిపిన ఘనత నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. భారత్ ను విశ్వగురువుగా చేసేందుకు మోదీ చేస్తున్న క్రుషితో పాటు తన 8 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలతో విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారని చెప్పారు.
కరోనాతో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిన సమయంలో మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు భేష్ అంటూ ప్రపంచ దేశాలే కొనియాడిన సంగతిని ఆయన గుర్తు చేశారు. 80 కోట్ల మంది పేదల ఆకలి తీరుస్తున్న మానవతావాది నరేంద్రమోదీ అని, రైతును రారాజు చేసేందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరువలేనివని కొనియాడారు.
దేశంలో ఇల్లులేని వాళ్లెవరూ ఉండకూడదనే లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 20 కోట్ల ఇండ్లను నిర్మిస్తున్న నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. పేదల ప్రగతి, దేశ అభ్యున్నతి కోసం మోదీ సాహసోపేత కార్యక్రమాలను అమలు చేస్తుంటే…. రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.
కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని అమ్ముకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇండ్లు నిర్మించకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణకు వర్తింపజేయకుండా కేసీఆర్ అడ్డుకుని రాష్ట్ర రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ పేరిట మోదీ ప్రభుత్వ విజయాలను వివరించారు. అదే సమయంలో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
నిజం చెప్పాలంటే స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం కాంగ్రేసేతర పార్టీ అధికారంలోకి కొనసాగిన రికార్డు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీకే చెల్లిందని తెలిపారు. భారతదేశం ఆజాదీ కా అమ్రుతోత్సవ్ సంబురాలు జరుపుకుంటున్న ఈ వేళ దేశంలో జరిగిన అభివ్రుద్ధిని చూస్తే…. స్వతంత్ర భారత చరిత్రలో గత 67 ఏళ్ల అభివ్రుద్ధి ఒక ఎత్తు… మోదీజీ 8 ఏళ్ల పాలనలో జరిగిన అభివ్రుద్ధి మరో ఎత్తు అని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత దేశంలో ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు ఉండాలన్నదే గొప్ప లక్ష్యం అని చెబుతూ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద దేశంలో 20 కోట్ల నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నదే ఆయన ఆశయం అని తెలిపారు. ఇప్పటికే 4 కోట్ల ఇండ్లను పూర్తి చేశారని చెప్పారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అవస్థలు పడ్డడని పేర్కొంటూ కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరని గుర్తు చేశారు. మోడీగారొచ్చిన తరువాత రైతును రాజును చేసే ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. అందులో మొదటిది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఏటా 6 వేల రూపాయలిస్తున్నారని గుర్తు చేశారు.
ఇప్పటిదాకా పీఎం కిసాన్ సమ్మాన్ ఇప్పటి వరకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 11 కోట్ల 30 లక్షల రైతుల ఖాతాల్లో 1 లక్షా 82 వేల కోట్ల రూపాయలను జమ చేశామని తెలిపారు. ఇక తెలంగాణ విషయానికొస్తే… 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో 81380 కోట్లు వేల వందల కోట్ల రూపాయలను జమ చేసిందని పేర్కొన్నారు.
ఇక ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి ఏటా ఎరువుల సబ్సిడీ నిధులను పెంచుతోంది. పోయిన సంవత్సరం 1 లక్షా 60 వేల కోట్లుంటే ఈ ఏడాది 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలు రైతుల కోసం కేవలం ఎరువుల సబ్సిడీకే ఖర్చు చేయబోతోందని వివరించారు.
మోదీజీ రాకముందు దేశంలో కోట్లాది మంది ఇండ్లలో మరుగుదొడ్లు లేవు. చెంబు పట్టుకుని బహిర్భూమికి వెళ్లేవారు. మహిళలు, ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మారడంతో ఎర్రకోటపై ప్రసంగిస్తూ టాయిలెట్ల నిర్మాణం గురించి మాట్లాడిన గొప్ప నాయకుడు… గత 8 ఏళ్లలో 11 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానాయకుడు మోదీజీ అని సంజయ్ పేర్కొన్నారు.