ప్రేమ వివాహాలు అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆర్య సమాజ్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోని సందర్భంలో ఆర్యసమాజ్ కు వెళ్లి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమైంది. పెళ్లి అనంతరం ఆర్యసమాజ్ ఇచ్చే సర్టిఫికెట్లు చట్టపరంగా చెల్లుబాటు అవుతున్నాయి.
అయితే ఆర్య సమాజ్లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. ఆర్య సమాజ్లో జరిగే పెళ్లిళ్లు, ఆ సంస్థ ఇస్తున్న సర్టిఫికెట్లను గుర్తించబోమని తెలిపింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని జస్టిస్ అజయ్ రస్తోగి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
సమర్థవంతమైన ప్రభుత్వ అధికారులు మాత్రమే వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయగలరని సుప్రీం స్పష్టం చేసింది. ఆర్య సమాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయడానికి కాదన్న సుప్రీంకోర్టు కుల, మతాలకు అతీతంగా ప్రేమించుకున్న యువత పెద్దల అంగీకారం లేకపోవడంతో నేరుగా ఆర్య సమాజ్ను ఆశ్రయిస్తున్నారని చెప్పింది.
అలా వచ్చిన యువ జంటలకు ఆర్య సమాజ్ పెళ్లిళ్లు చేస్తోందని, ఇలా జరిగిన పెళ్లిళ్లపై ఆయా కుటుంబ పెద్దలు కక్షలు పెంచుకోవడం, పరువు హత్యలు క్రమంగా పెరిగిపోతున్న వైనంపై దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఇకపై ఆర్య సమాజ్ ఇచ్చే వివాహ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
తమ మార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మధ్యప్రదేశ్కి చెందిన బాలిక కుటుంబం ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్ అని పేర్కొంది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిపై 363, 366ఏ, 384, 384 సెక్షన్లతో పాటు పోక్సో కింద కూడా కేసు నమోదు చేశారు.
ఈ కేసును సవాల్ చేస్తూ ఆ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ బాలిక మేజరేనని, ఇష్టపూర్వకంగానే ఇంటి నుండి వచ్చిందని పేర్కొన్నాడు. ఆర్యసమాజ్లో తాము వివాహం చేసుకున్నామని.. కేంద్ర భారతీయ ఆర్య ప్రతినిధి సభ జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించాడు.
వాస్తవానికి ఆర్య సమాజ్ ఒక హిందూ సంస్కరణవాద సంస్థ. దీనిని 1875లో స్వామి దయానంద్ సరస్వతి స్థాపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీని శాఖలున్నాయి.