హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసును సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అమ్మాయిలకు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదని, క్రిమినల్స్ కు, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు.
మైనర్ బాలికపై గత నెల 28న (మే 28న) అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో నిందితుల పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బాధితురాలు నిందితుల పేర్లు చెప్పినా ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని ధ్వజమెత్తారు. నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
సాక్షాత్తు ప్రజాప్రతినిధుల పిల్లలపై ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీసేరు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ధ్వజమెత్తారు. నిందితులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేసుతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించాలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయని సంజయ్ ఆరోపించారు. మైనర్ బాలికపై అత్యాచార సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఈ కేసు విషయంలో నిందితులను అరెస్ట్ చేయాలని ఆందోళనలు చేసిన బీజేపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారుల్లో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో డ్రగ్స్ కేసులోనూ హంగామా సృష్టించి, కేసును వదిలేశారని, ఏ కేసులోనూ పురోగతి లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా బాధితురాలి విషయంలో న్యాయం చేయాలని కోరారు.
హోమ్ మంత్రిని తొలగించాలి
కాగా, విచారణ పూర్తి అయ్యేవరకు హోంమంత్రిని తొలగించాలని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడి బ్యాచ్లర్ పార్టీ వల్లే రేప్ ఘటన జరిగిందని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కోరుతూ పబ్లోకి మైనర్ను ఎలా అనుమతించారు? అని ప్రశ్నించారు.
పైగా ఆ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీ లేదనడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దల యత్నిస్తున్నారని ఆరోపించారు. కారు నెంబర్ ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ప్రశ్నించారు.