21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ అవతరించిందని చెబుతూ నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
లక్నోలో మూడో యుపి పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు.
‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. గతేడాది 100కు పైగా దేశాల నుంచి భారత్ కు రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 417 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇదొక సరికొత్త రికార్డు” అని ప్రధాని తెలిపారు.
మన ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుందని గుర్తు చేస్తూ ఎనిమిదేళ్లుగా సంస్కరణ–పనితీరు–మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. విధాన నిర్ణయాల్లో స్థిరత్వం, పరస్పర సహకారం, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
‘ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒక్కటే రేషన్ కార్డు’ వంటివి మన స్పష్టమైన, బలమైన ప్రయత్నాలకు నిదర్శనం. రక్షణ రంగంలో తయారీకి గతంలో ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా 300 రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసుకోబోతున్నామని వెల్లడించారు.
రక్షణ తయారీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నవారికి మార్కెట్ సిద్ధంగా ఉందని చెబుతూ దేశంలో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు చేపడతామని ప్రధాని తెలిపారు.
2014 పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెబుతూ అప్పట్లో 6 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ ఖాతాదారులు ఉండేవారని, ఇప్పుడు 78 కోట్లకు చేరారని మోదీ పేర్కొన్నారు. జీబీ డేటా ధర రూ.200 ఉండేదని, ఇప్పుడు రూ.11–12కు దిగొచ్చిందని చెప్పారు. 2014లో 100 కంటే తక్కువ గ్రామాలే ఆప్టికల్ ఫైబర్తో కనెక్ట్ అయ్యాయిని, ఇప్పుడు వాటి సంఖ్య 1.75 లక్షలని తెలిపారు. 70 వేల దాకా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయని వివరించారు.
యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దారుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.