కశ్మీర్లో హిందువుల వరుస హత్యలు చోటుచేసుకుంటున్న వైనంపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కేంద్రం సర్కార్ పై విరుచుకు పడుతూ, ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ పనిలో విఫలమయ్యారని, అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అమిత్ షా హోం శాఖను వదిలేసి క్రీడల శాఖను చేపడితే బాగుంటుందని స్వామి ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న జమ్మూకశ్మీర్లో నిత్యం ఓ హిందువు హత్యకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. టాటా ఐపీఎల్ క్రికెట్ ఫలితాలు అవకతవకలకు గురయ్యాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో విస్తృతమైన భావన ఉందని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.
అమిత్ షా కుమారుడు బిసిసిఐకి డిఫాక్టో నియంత అయినందున ప్రభుత్వం దానిపై ఏమీ చేయదు కాబట్టి పిఐఎల్ పై అనుమానాలు నివృత్తిచేయడానికి దీనికి దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. నల్లధనం సంపాదించేందుకు ఐపీఎల్ను ఉపయోగిస్తున్నారని స్వామి గతంలో ఆరోపించారు. కానీ బీసీసీఐలో జే షా ఉండటం వల్ల భారత్లో క్రికెట్ పరిపాలనకు సంబంధించిన ఆరోపణల నుండి అమిత్ షా రక్షణ పొందలేరని తేల్చి చెప్పారు.
“జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఉంది. ప్రతిరోజూ ఒక కాశ్మీరీ హిందువును కాల్చి చంపుతున్నందున, అమిత్ షా రాజీనామా అడగడం అవసరం. ఈ రోజుల్లో క్రికెట్కు అనవసరమైన ఆసక్తి ఉన్నందున ఆయనకు హోమ్ కు బదులు క్రీడా మంత్రిత్వ శాఖ ఇవ్వవచ్చు” అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో హిందువులకు రక్షణగా ఓ లక్ష మంది మాజీ సైనిక సిబ్బంది స్థిరపడేటట్లు చేయాలని ఆయన శుక్రవారం ఓ ట్వీట్ లో కోరారు. అమిత్ షా అటువంటి భద్రతను సిద్ధం చేయకుండా కాశ్మీర్ లోయలో సాధారణ స్థితికి వచ్చిందని చెబుతూ ఉండడం పట్ల స్వామి విస్మయం వ్యక్తం చేశారు.
కాగా, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై షా “తప్పుడు అంచనాలు” పెంచుతున్నారని డా. స్వామి ఆరోపించారు. మనం 1991 చట్టానికి కట్టుబడి ఉన్నప్పుడు జ్ఞానవాపి మందిర్పై తప్పుడు అంచనాలను పెంచడానికి కూడా అమిత్ షా బాధ్యత వహించ వలసిందే అని స్పష్టం చేశారు.