దక్షిణాదిన పార్టీని విస్తరింప చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి పట్ల బలమైన ప్రాంతీయ పక్షాలలో అవిశ్వాసం వ్యక్తం అవుతున్నది. ఆ పార్టీతో కొంతకాలంగా పొత్తులో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తమిళనాడులోని అన్నాడీఎంకే. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఈ పొత్తు పట్ల అసహనం వ్యక్తం అవుతున్నది.
ఈ మధ్య ఆ పార్టీ సీనియర్ నేత సి పొన్నయన్ మిత్రపక్షమైన బీజేపీపై చేసిన ఊహించని దాడి బీజేపీతో పొత్తు పట్ల ఆ పార్టీ శ్రేణులలో పెరుగుతున్న వ్యతిరేకతను వెల్లడి చేస్తుంది. ఒక వంక, డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంటూ ఉండడంతో మిత్రపక్షం బిజెపి ఆవలంభిస్తున్న ధోరణులు డీఎంకేకు సానుకూలంగా మారుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా గవర్నర్ కేంద్రంగా స్టాలిన్ – మోదీ ప్రభుత్వాల మధ్య పెరుగుతున్న వివాదాలతో డీఎంకే లాభపడుతున్నట్లు కనిపిస్తున్నది. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన `రాజకీయ సూన్యత’ను ఆసరాగా తీసుకొని బలం పెంచుకోవాలని ప్రయత్నం చేసిన బిజెపి అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోకుండా కాపాడటమే కాపాడుకొంటూ వచ్చింది.
అయితే, ఆ పార్టీలో ప్రజాకర్షణ గల నేతలు లేకపోవడంతో, జయలలిత నెచ్చలి శశికళపై ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం అన్నాడీఎంకే నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నది. జైలు నుండి రాగానే ఆమెను పార్టీలో చేర్చుకొనేవిధంగా బిజెపి చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. దానితో ఆమె సొంతంగా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తే, ఆ విధంగా చేస్తే డీఎంకే అధికారంలోకి వస్తుందనే భయంతో ఆమెను రాజకీయంగా మౌనంగా ఉండేటట్లు బిజెపి చేసింది.
అన్నాడీఎంకేలో ఇద్దరు అగ్రనాయకులు మధ్య నెలకొన్న విబేధాలను ఉపయోగించుకొని ఆ పార్టీ నాయకత్వాన్ని కైవసం చేసుకోవడానికి శశికళ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం ఫలించడం లేదు. అందుకు బిజెపి సహకరిస్తుండటమే అన్నాడీఎంకే నేతలలో అసహనం పెరగడానికి కారణంగా కనిపిస్తున్నది.
ఎఐఎడిఎంకె కురువృద్ధుడు మరియు పార్టీ సంస్థాగత కార్యదర్శి పొన్నయన్ బిజెపితో పొత్తు తమ పార్టీకి ప్రమాదకరమని హెచ్చరించడమే కాకుండా, బిజెపి నేతృత్వంలోని కేంద్రం రాష్ట్ర ఆదాయాలను “దొంగిలించుకుందని”. “తమిళ వ్యతిరేక” విధానాలకు పాల్పడుతోందని కూడా ఆరోపియన్చడం గమనార్హం. కేవలం బీజేపీఐతో పొత్తు కారణంగా మైనారిటీ ఓటర్లు పార్టీకి దూరం కావడంతో గత ఏడాది ఎన్నికలలో ఓటమి చెందామని చెప్పుకు వచ్చారు.
“అస్తిత్వ సంక్షోభాన్ని” అధిగమించేందుకు పార్టీ అధికారికంగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పొన్నయన్ ప్రకటనలు ఉన్నాయని పలువురు ఏఐఏడీఎంకే నేతలు భావిస్తున్నారు.
మరోవంక, కర్ణాటక కేడర్కు చెందిన 38 ఏళ్ల మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలు తరచూ అసంబద్ధంగా ఉంటున్నప్పటికీ, పార్టీ నేతలు పలువురు అతను ధోరణుల పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మద్దతు కారణంగా ఎవ్వరు ఏమీ మాట్లాడలేక పోతున్నారు.
మరోవంక, రాష్ట్రంలో డీఎంకేకు ప్రత్యామ్నాయం బీజేపీ కాదని, పీఎంకే మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలకు తావులేదని పేర్కొంటూ రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ఉదాహరణకు కావేరి నదిపై మెకెదాటు వద్ద కొత్త ఆనకట్ట నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ స్పందించడం లేదని, పైగా కర్ణాటక ప్రభుత్వానికి మద్దతిచ్చేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.