వచ్చే ఎన్నికలకు సంబంధించి బిజెపితో తమ పార్టీ బంధం పటిష్టంగా ఉన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో పొత్తుకు సంబంధించి తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నట్లు వెల్లడించారు.
జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమ ముందున్న మూడు ఆప్షన్లు అని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని, మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తిని పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదని పవన్ హితవు చెప్పారు.
తమకు, బిజెపికి మధ్య కొంత సామాజిక అంతరం ఏర్పడినదని అంగీకరించారు. అయితే ఇప్పుడది పోయిందని తెలిపారు. ఇటీవల బీజేపీ జాతీయ నేతలతో కూడా చర్చించానని ఆయన వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలెవరూ చెప్పలేదని ఏ సందర్భంగా స్పష్టత ఇచ్చారు.
పొత్తులపై తనను అందరూ అడుగుతున్నారని పేర్కొంటూ గతంలో `వన్ సైడ్ లవ్’ అనే కామెంట్లు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు `వార్ వన్ సైడ్’ అంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు స్పష్టత ఏర్పడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతానని ప్రకటించారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాను చాలాసార్లు తగ్గానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే, ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుందని అంటూ పొత్తుల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవలసింది బిజెపి, టిడిపిలో అంటూ తేల్చి చెప్పారు. పైగా, 2014, 2019లో తగ్గాం.. 2024లో తగ్గేదే లేదని పవన్ తేల్చిచెప్పడం ద్వారా వారిద్దరూ కలసి రాకపోయినా తాను ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.
పొత్తు నేపథ్యంలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందని వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ అది ఎవరి ఆశ అయినా కావొచ్చునని పవన్ పరోక్షంగా అధికార పక్షాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తనకు మాత్రం అలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ… ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు’’ అని పవన్ తేల్చి చెప్పారు.
ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ ‘‘ఒంటరిగా పోటీ చేసే మీకు… ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు?’’ అని పవన్ ఎద్దేవా చేశారు.