రెండు తెలుగు రాష్ట్రాలలో కుటుంభం పార్టీలతోనే బిజెపి పోరాటం అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జ్ల సమావేశంలో మాట్లాడుతూ ఎపీలో వైసీపీ..టీడీపీ తో పాటుగా తెలంగాణలోని టీఆర్ఎస్ కుటుంబ పార్టీలని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీంను జగన్ బాబు ఆరోగ్యశ్రీ పేరుతో మార్చేసారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ రాష్ట్రానికే పరిమితమని, ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా వినిగియోగించుకోవచ్చని తెలిపారు.
ఇక, జాతీయ పార్టీగా దేశంలో ఉన్నది బీజేపీ ఒక్కటేనని చెబుతూ కాంగ్రెస్ పార్టీలో `జాతీయత’ లేదని, `జాతీయ’ అసలేదని..కాంగ్రెస్ వారికి వర్తించందంటూ ఎద్దేవా చేశారు. లండన్ లో కూర్చొని దేశానికి సంబంధించిన ప్రకటనలు ఇస్తారంటూ..అది అన్నా – చెల్లెల్ల పార్టీగా నడ్డా అభివర్ణించారు.
బీజేపీ ఇప్పుడు పోరాటం చేస్తుంది ప్రాంతీయ పార్టీలతోనేనని పేర్కొంటూ మరోసారి కేంద్రంలో అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకొచ్చారని చెబుతూ అవినీతి, వారసత్వ..కుటుంబ రాజకీయాలకు చమరగీతం పాడారని నడ్డా చెప్పుకొచ్చారు.
దేశం కరోనా వ్యాక్సిన్ ను అభ్యర్దించే పరిస్థితి నుంచి విదేశాలకు ఉచితంగా అందించే స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 48 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని నడ్డా చెప్పారు.
బీజేపీ రాకీయ ప్రస్థానం ఉమ్మడి ఏపి హన్మకొండ నుంచి ప్రారంభమైందని చెబుతూ బీజేపీకి ఎంతో మంది నేతలను ఏపీ అందించిందని నడ్డా పేర్కొన్నారు. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీలో 46 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెబుతూ రాజకీయాల్లో మార్పు కోసం అందరం కలిసి పని చేద్దామని నడ్డా పిలుపునిచ్చారు. 8569 శక్తి కేంద్రాలు ఏపీలో ఉన్నాయని అంటూ 6 నుంచి ఏడు వేల మంది ఉన్నారని, నాలుగు నుంచి అయిదు పోలింగ్ బూతులు పర్యవేక్షించాలని సూచించారు.
రానున్న రెండు నెలల్లో శక్తి కేంద్రాల్లో నియామకాలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ బూత్ లు కేంద్రంగా అన్ని వర్గాల వారిని పార్టీతో మమేకం చేయాలని నిర్దేశించారు. బూతు కమిటీల నియామకం త్వరిత గతిన అందిరీ భాగస్వాములను చేస్తూ..అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ పూర్తి చేయాలని చెప్పారు.
కేంద్రం అమలు చేస్తున్న పథకాలు పేదలకు అందుతుందా లేదా చూడాలని నడ్డా స్పష్టం చేసారు. ఏపీ కోసం ప్రధాని మోదీ ఏం చేసారనే అంశం పైన పుస్తకం ప్రచురించామని చెబుతూ దీనిని ప్రతీ ఇంటికి అందించాలని సూచించారు. ఇదే తాను ఇస్తున్న రూట్ మ్యాప్ అని చెబుతూ దీనిని పక్కాగా అమలు చేస్తే రానున్న రోజుల్లో ఏపీలో పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఖాయమని నడ్డా చెప్పుకొచ్చారు.
ప్రతీ నెలా చివరి ఆదివారం ప్రదాని మన్ కీ బాత్ ప్రతీ బూత్ లో ఆ ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వినాలని కోరారు. ప్రతీ ఇంటికి వెళ్లి మోదీ ప్రభుత్వం ఏం మేలు చేసిందో వివరించి.., వారిని ఒప్పించి.. వెళ్లిన ప్రతీ ఇంటికి బీజేపీ స్టిక్కర్ అంటించాలని సూచించారు. ప్రతీ బీజేపీ కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలని నడ్డా స్పష్టం చేసారు. ఏ పార్టీకి లేని నాయకత్వం, కార్యకర్తలు బీజేపీకి ఉన్నారని చెప్పారు.
పొత్తులపై నోరుమెదప వద్దు
కాగా, పొత్తులపై రాష్ట్ర నేతలెవ్వరూ నోరు మెదపొద్దని జేపీ నడ్డా ఏపీలోని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.సోమవారం రాత్రి విజయవాడలో \ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. పొత్తులపై రాష్ట్ర నేతలెవ్వరూ నోరు మెదపొద్దని స్పష్టం చేశారు. ఆ పార్టీకి దూరం.. ఈ పార్టీకి దూరం అనే తరహా కామెంట్లు కూడా చేయ్యవద్దని మందలించారు.
పొత్తుల గురించి పవన్ ఇచ్చిన ఆప్షన్లను, సిఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్లపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది పార్టీ హైకమాండ్ పరిధిలో అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
ఈ విషయాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని నేతలకు నడ్డా సూచించారు. 18 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన హైకమాండుకు ఎపిని ఎలా డీల్ చేయాలో తెలీదనుకుంటున్నారా..? అంటూ ప్రశ్నించారు.