“కాషాయ తీవ్రవాదులను బతకనీయం.. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తాం” అని అల్ఖైదా ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. అయితే ఈ లేఖ ఈ నెల 6వ తేదీన విడుదల చేసినట్టు తెలుస్తోంది.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది. ‘‘మా ప్రవక్తను అవమానించేవారిని మేము వదిలిపెట్టం, చంపేస్తాం.. మా ప్రవక్తను అవమానించే ధైర్యం చేసే వారి దేహాలను పేల్చివేయడానికి మా శరీరాలతో, మా పిల్లల శరీరాలతో పేలుడు పదార్థాలను నింపుకొని వస్తాం.. కాషాయ ఉగ్రవాదుల అంతం కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయి. బొంబాయి, యూపీ, గుజరాత్లో ఇవి జరుగుతతాయి ” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఖతర్, కువైట్, యూఏఈ, పాకిస్థాన్, మాల్దీవ్, ఇండోనేషియా.. ఇలా దాదాపు పదిహేను దేశాలు నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. ఒక టీవీ చర్చ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, బీజేపీ ఢిల్లీ మీడియా యూనిట్ అధ్యక్షుడు నవీన్ జిందాల్ కూడా ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యను పోస్ట్ చేశారు.
ఈ వివాదం దృష్ట్యా బీజేపీ వారిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేసినా గల్ఫ్ దేశాలలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయా దేశాలలో పలు సూపర్ స్టోర్స్ లలో భారతీయ వస్తువులను ఉంచడం నిలిపివేశారు.
నూపుర్ శర్మకు పోలీసు భద్రత
ఇలా ఉండగా, బీజేపీ నుంచి సస్పెండైన నూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. సదరు వ్యాఖ్యలకు సంబంధించి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని, చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆమె గత నెల 28నే తమ సైబర్ సెల్ యూనిట్కు ఫిర్యాదు చేశారని.. దానిపై ఐపీసీ 505, 506, 509 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
దీనిపై దర్యాప్తు చేసే సమయంలో వ్యక్తుల మధ్య శత్రుత్వం పెంచుతున్నారంటూ కొందరు వ్యక్తులపై నూపుర్ మరో ఫిర్యాదు చేశారని.. దాంతో ఐపీసీ 153ఏ సెక్షన్ను కూడా జతచేసినట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని.. ట్విటర్ సంస్థకు నోటీసులు జారీచేశామని వెల్లడించారు.
మరోవైపు తనను సస్పెండ్ చేస్తూ బీజేపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, దానిని అంగీకరిస్తున్నానని నూపుర్ తెలిపారు. కాగా.. తనను, తన కుటుంబ సభ్యులను చంపుతామన్న బెదిరింపు కాల్స్ తనకు కూడా వస్తున్నాయని మరో బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నూపుర్ శర్మకు బాలీవుట్ నటి కంగనా రనౌత్ మద్దతుగా నిలిచారు. తన అభిప్రాయాలు వ్యక్తీకరించే హక్కు ఆమెకుందని ఇన్స్ట్రాగ్రాంలో పేర్కొన్నారు.