ఏపీలో వైయస్సార్సీపీ ప్రభుత్వం పోయి, బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం సాయన్తరం ఏర్పాటు చేసిన బీజేపీ `గోదావరి గర్జన’ బహిరంగ సభలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అంటూ నినాదం ఇచ్చారు. ఏపీ సర్కారు విచక్షణారహితంగా అప్పులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు. ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుందని విమర్శించారు.
ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశంలో పేదరికం తగ్గడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగం అందుకున్నాయని చెబుతూ 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవని గుర్తు చేశారు. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదని, గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలు నిలిచేవని, బంధుప్రీతి, వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదని తెలిపారు.
అయితే, మోదీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో సంస్కరణలు తెచ్చారని, దేశ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెబుతూ దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశంలో 35 కోట్ల మందికి ముద్ర రుణాలు అందించామని వెల్లడించారు.
కరోనా వేళ 80 కోట్ల మందికి రేషన్ అందించామని, దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ బీజేపీ హయాంలో పేదరికం 0.8 శాతం తగ్గిందనని తెలిపారు. దేశంలో ప్రాథమిక పాఠశాలలు 6.53 లక్షలకు చేరాయని వెల్లడించారు. భారత్లో 70 వేల స్టార్టప్లు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 142 నుంచి 63వ స్థానానికి చేరామని నడ్డా చెప్పారు.
వంద దేశాలకు మనం కరోనా టీకా డోసులు అందించామని, 48 దేశాలకు ఉచితంగా కరోనా టీకా డోసులు అందజేశామని తెలిపారు. ఖాదీ వారసులమని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని, అయితే, బీజేపీ హయాంలోనే రూ.1.15 లక్షల కోట్ల ఖాదీ అమ్మకాలు జరిగాయాని నడ్డా తెలిపారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని నడ్డా వివరించారు.
ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతూ జగన్ ప్రభుత్వం మూడేళ్ళలో రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రూ.8.7 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం పెడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ హయాంలో మాతృభాషకు పెద్దపీట వేశామని, అయితే ఏపీలో రాష్ట్రంలో తెలుగు భాషకు అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు.
పలు సంక్షేమ పథకాలకు జగన్ పాలనలో నిధులు తగ్గుతున్నాయని, కేంద్రం తరఫున రూ.77 వేల కోట్లు అందించామని జేపీ నడ్డా చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 27 లక్షల ఇళ్లు, ఏపీ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, గిరిజన వర్సిటీ మంజూరు చేశామని వెల్లడించారు.
బీజేపీ హయాంలో సాగు బడ్జెట్ రూ.1.04 లక్షల కోట్లకు పెరిగిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని జేపీ నడ్డా ఆరోపించారు. ప్రతిపక్షాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సినీ నటి జయప్రద, కేంద్ర మాజీ మంత్రులు దగ్గుబాటి పురందేశ్వరి, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.