ఈ ఏడాది ఖాళీగా ఉన్న 1,450 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ సీట్లను ఖాళీగా ఉంచడం సరికాదని పేర్కొంది. ‘‘మీరు వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది.
ఈ ఏడాది నీట్ పీజీ ఆల్ ఇండియా కోటాలో 1456 సీట్లు ఖాళీగా ఉండటంతో ఆ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలివ్వాంటూ కొందరు వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధా బోస్లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, ఒక్క మెడికల్ సీటు ఖాళీగా ఉన్న భర్తీ చేయాల్సిందేనని మండిపడింది. అదనంగా మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించి ఈ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ అఫిడవిట్ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని ఆదేశించింది.
వైద్యుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకుంటున్నందుకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. వైద్యులు, సూపర్ స్పెషలిస్టులు అవసరమైనపుడు, ఈ సీట్లను ఖాళీగా ఉంచుకోవడం వల్ల కేంద్రానికి వచ్చే ప్రయోజనమేమిటని ప్రశ్నించింది. మరొక మాప్ అప్ రౌండ్ నిర్వహించి ఉండవలసిందని చెబుతూ ప్రతిసారీ కోర్టు జోక్యం చేసుకోవలసి వస్తోందని, కోర్టు ఆర్డర్ కోసం ఎందుకు వేచి చూస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
‘‘మీకు (కేంద్ర ప్రభుత్వానికి) చాలా మంది డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు అవసరమైనపుడు, ఈ సీట్లను ఖాళీగా ఉంచుకోవడం వల్ల మీకు ఏం వస్తుంది? మీరు మరొక మాప్ అప్ రౌండ్ నిర్వహించి ఉండవలసింది. బాధ్యత ఉందని భావిస్తున్నారా? ప్రతిసారీ కోర్టు జోక్యం చేసుకోవలసి వస్తుంది. కోర్టు ఆర్డర్ కోసం ఎందుకు వేచి చూస్తున్నారు? వైద్యుల భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన విషయం ఇది. మీరు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, మన దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది’’ అని ధర్మాసనం మండిపడింది.