రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విషయమై చొరవ తీసుకొని ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాంగ్రెసేతర అభ్యర్థి ఎంపికకు ఆమె ప్రతిపాదించారు. అయితే బిజెపి తన అభ్యర్థిని ప్రకటించే వరకు ప్రతిపక్షాలు వేచి ఉండే అవకాశం ఉంది.
డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సోనియా గాంధీ మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయమై ఏకాభిప్రాయం సాధించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా అప్పగించారు.
ఎన్డీయే యేతర, యుపిఎ యేతర పార్టీల ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనేదానిపై వారి అభిప్రాయాలు కోరుతున్నారు. ఖర్గే ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లతో బాటు, , వైసిపి, టిఆర్ఎస్, బిజెడి వంటి యుపిఎ యేతర పార్టీల నేతలను కూడా కలుస్తారు.
రాజ్యసభ ఎన్నికల సమన్వయం కోసం ముంబాయిలో ఉన్న ఖర్గే, ఎన్సిపి అధినేత శరద్ పవార్ను కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు డిఎంకె, టిఎంసి నేతలను కలవనున్నారు.
2017లో అప్పటి బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ను బిజెపి చివరి నిమిషంలో తెరపైకి తెచ్చింది.. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని మార్చుకోవల్సి వచ్చింది. తొలుత ఉమ్మడి అభ్యర్థిగా మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని దింపాలని భావించాయి. అయితే బిజెపి దళిత వ్యక్తిని రంగంలోకి తీసుకురావడంతో, ఆయనకు పోటీగా దళిత మహిళ మీరా కుమార్ను బరిలోకి దింపాయి.
రాష్ట్రపతి పదవికి బిజెపి అభర్ధులు కాగలవారుగా ప్రచారంలో ఉన్న పేర్లలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి జుయల్ ఓరమ్, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉన్నారు.