నాలుగు రాష్ట్రాలలో 16 సీట్ల కోసం శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికలలో రాజస్థాన్ లో తప్ప, మిగిలిన మూడు రాష్ట్రాలలో బిజెపి వ్యూహం ఫలించి, తమ అభ్యర్థులను సునాయనంగా గెలిపించుకోగలిగింది.
రాజస్థాన్ లో మాత్రం బిజెపి ఎత్తుగడలను అధిగమించి కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు గెలుపొందగా, బిజెపి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి, జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర క్రాస్ ఓటింగ్ పై నమ్మకం పెట్టుకొని ఓటమి పాలయ్యారు.
మొత్తం మీద బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుపొందింది. శివసేన, ఎన్సీపీ చెరోస్థానం గెలుచుకున్నాయి. మహారాష్ట్రలో ఆరో స్థానం కోసం శివసేనకు చెందిన సంజయ్ పవార్, బీజేపీ అభ్యర్థి ధనంజయ్ మాదిక్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి మహదిక్ 41 ఓట్లతో విజయం సాధించారు. పవార్కు 33 ఓట్లు వచ్చాయి.
ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగాబీజేపీ అభ్యర్థులైన గోయల్, బోండేలకు అత్యధికంగా 48 ఓట్లు వచ్చాయి. ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్కు 43 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్గాడికి 44 ఓట్లు, శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్కు 41 ఓట్లతో గెలుపొందారు.
ఎన్సీపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. అక్రమాస్తులు, మామూళ్ల వసూలు, మాఫియాతో సంబంధాలు తదితర ఆరోపణలపై ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు.
హర్యానాలోని రెండు స్థానాలకు జరిగిన రాజ్యసభ పోలింగ్లో నాటకీయ మలుపులు శనివారం తెల్లవారుజామున ముగిశాయి, ఎన్నికల సంఘం బిజెపి అభ్యర్థి క్రిషన్ పన్వార్, బిజెపి-జెజెపి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ విజయం సాధించినట్లు ప్రకటించింది. శర్మ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ ఓడిపోయారు.
కాంగ్రెస్కు మొదటి నుంచి క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతున్నది. అందుకే తమ ఎమ్మెల్యేలందరినీ కలిసి ఉండమని చెప్పి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్కు తీసుకెళ్లింది. కర్ణాటక నుంచి బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు జగ్గేశ్; బీజేపీ ఎమ్మెల్సీ, పారిశ్రామికవేత్త లెహర్సింగ్ సిరోయా, కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ జైరాం రమేశ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇక్కడ బలం లేకున్నా మరో స్థానానికి కాంగ్రెస్, జేడీఎస్ వేర్వేరుగా అభ్యర్థులను బరిలోకి దించాయి.ఈ రెండు పార్టీల పోరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందింది. మరో స్థానం బోన్సగా దానికి దక్కింది.
రాజస్థాన్లో కాంగ్రెస్ తరఫున సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ తివారీ కూడా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో ఏర్పడిన వివాదాల దృష్ట్యా మహారాష్ట్ర, హర్యానాల్లో శనివారంగాని ఫలితాలు వెలువడలేదు.