జూబ్లీ హిల్స్లో జరిగిన సంఘటనపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించక పోవడం వల్లే రాష్ట్రం లో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన వారి వీపులను ప్రజలు త్వరలోనే పగలగొడతారని హెచ్చరించారు.
ఆదివారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో 5 రోజుల కిందట అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులతో కలసి సంజయ్ పరామర్శించారు. తెలంగాణలో బాలికలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నేరస్థులను ఎలా కట్టడి చేయాలో ఉత్తర్ప్రదేశ్ వెళ్లి తెలుసుకోవాలని సంజయ్ సీఎం కేసీఆర్కు హితవు చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాలు తీసుకుని, తెలంగాణలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యాచారాల నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే, నేరస్థుల పాలిట సింహస్వప్నంగా మారిన యోగిని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.
నేరాల పట్ల కఠినంగా వ్యవహరించక పోవడం, ఘటన జరిగిన వెంటనే స్పందించకపోవడం వల్లే రాష్ట్రంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం దుండగుల పట్ల కఠినంగా వ్యవహరిం చకపోగా వారికి రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. అత్యాచార ఘటనలపై ముఖ్య మంత్రి కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
అత్యాచారాలకు సంబంధించిన సంఘటనలను మీడియా, ప్రజలు వెలుగులోకి తీసుకొస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయని సంజయ్ ప్రశ్నించారు. ఇటీవల కార్ఖానాలో ఎంఐఎం ఇలాంటి ఘటనకు పాల్పడిందని దోషులను కఠినంగా శిక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సునీతారెడ్డి పాల్గొన్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని స్థానిక మహిళలు సంజయ్ను డిమాండ్ చేశారు.తమకు ఓదార్పులు అవసరం లేదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు బయటకు వస్తే ఊరుకునే సమస్య లేదని హెచ్చరించారు.