జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని సర్పంచ్ లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్ల పూర్తయిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్లకు మోదీ ఓ లేఖ వ్రాస్తూ ఈ ఎనిమిదేళ్లలో గ్రామస్థాయిలో వారందించిన సహకారాన్ని, చేసిన సేవల్ని కొనియాడారు.
మానవత్వం కోసం యోగా అనే థీమ్తో ఈ ఏడాది నిర్వహిస్తున్న యోగా డేని సర్పంచులు తమ, తమ గ్రామాల్లో ఏదైనా పురాతన పర్యాటక కేంద్రాన్ని లేదంటే నదీ తీరంలో నిర్వహించాలని గ్రామంలో ప్రతీ ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సాహించాలని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. యోగా డే రోజు తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని సూచించారు.
పంచాయతీలకు సాధికారత కల్పించి గ్రామస్వరాజ్యం సాధించడంలో ఎనిమిదేళ్లలో భారత్ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని తెలిపారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ చేరేలా కృషి చెయ్యాలని సర్పంచులకు ఆయన పిలుపునిచ్చారు.
75 ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ నీటి సంరక్షణపై అత్యధిక దృష్టి పెట్టాలని. ప్రతీ నీటి బొట్టు విలువైనదని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా కృషి చేస్తే సదరు గ్రామంతో పాటు దేశం కూడా సుసంపన్నంగా మారుతుందని మోదీ చెప్పారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలన్నీ స్వయం సమృద్ధి సాధిస్తే దేశం పురోగతిలో ముందుంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు.