కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదటిసారిగా ఓ దర్యాప్తు సంస్థ ముందు హాజరై, సోమవారం 10 గంటలకు పైగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంగళవారం కూడా హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో తమ కుటుంబానికి చెందిన కంపెనీ వ్యవహారాలలో భారీ ఎత్తున ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ చేసిన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అగ్రనాయకులు అందరు వెంట నడచి రావడం,ఢిల్లీలో ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోవలసి వచ్చింది. తమ కుటుంభం అక్రమంగా సంపాదించుకున్న సుమారు రూ 2,000 కోట్ల ఆస్తులను కాపాడుకోవడం కోసం మొత్తం పార్టీని ఉపయోగించుకొంటున్నారని ఈ సందర్భంగా బిజెపితో పాటు కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
రాజస్థాన్, చ్చతిస్ ఘడ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, సీనియర్ నేతలు అధీర్ రంజన్ చౌధురి, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, పి.చిదంబరం, హరీశ్ రావత్, దిగ్విజయ్సింగ్, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్ తదితరులు కాన్వాయ్లోని ఇతర వాహనాల్లో ఆయన్ను ఈడీ కార్యాలయం వరకు అనుసరించారు. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లపై నుంచి దూకి ఈడీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్కు తరలించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ అధీనంలో ఉంది. దాన్ని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్). ‘యంగ్ ఇండియన్’ కంపెనీకి రాహుల్, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో అత్యధిక వాటా వారిదే. ఆ కంపెనీ ఆవిర్భావం, ఏజేఎల్కు కాంగ్రెస్ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణం, నేషనల్ హెరాల్డ్లో అంతర్గతంగా నిధుల బదిలీ తదితర అంశాలపై ఈడీ అధికారులు రాహుల్ను ప్రశ్నించినట్లు తెలిసింది.
రాహుల్, సోనియా అక్రమంగా సంపాదించిన రూ.2,000 కోట్ల ఆస్తులను కాపాడడానికే కాంగ్రెస్ వాళ్లు వీధికెక్కారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. ఈడీపై ఒత్తిడి తెచ్చేందుకే బలప్రదర్శనలకు దిగారని విలేకరుల సమావేశంలో ఎద్దేవాచేశారు. అగ్ర నేతల అవినీతి బట్టబయలు కావడంతో సీనియర్ నేతలందరినీ ఢిల్లీకి రప్పించారని ఆమె దుయ్యబట్టారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించినప్పుడు అందులో 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులకు షేర్లు ఉన్నాయని.. ఇప్పుడు సోనియా కుటుంబం సొంతం చేసుకుందని ఆమె తెలిపారు. రాహుల్గాంధీ సహా చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆమె స్పష్టం చేశారు.