‘‘ కేసీఆర్…. నువ్వు సీఎంగా ఉండేది మహా అంటే 6 నెలలు.. ఏడాదే…. రాష్ట్ర ప్రజలను రాచి రంపాన పెడుతున్నవ్… వాళ్ల ఉసురు నీకు తగలక మానదు’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరాచకంతో సైకోలా మారితే రాష్ట్ర ప్రజలు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు.
సంజయ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు బుధవారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ డా. తమిళసై సౌందర రాజన్ ను కలిశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుసహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి గవర్నర్ కు వినతి పత్రం అందించారు.
అదే విధంగా గౌరవెల్లి బాధితులతో కలిసి గౌరవెల్లి నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్, పరిహారం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మరో వినతి పత్రం అందజేశారు. అట్లాగే బాసర ట్రిపుల్ ఐటీలో కనీస వసతుల్లేక, అధ్యాపకుల్లేక వేలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, ఆయా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం ఆయా నేతలతో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే సర్పంచులకు పూర్తి అధికారాలు బదలాయిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ పొందుపర్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా చట్టం తీసుకొచ్చి సర్పంచులను రాచిరంపాన పెడుతున్నారని మండిపడ్డారు. సర్పంచులకు అధికారాల్లేకుండా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వ తీరువల్ల సర్పంచులు కూలీలుగా మారుతున్నారని, ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. సర్పంచులు ఎందుకు గెలిచామా? అనే భావనలో ఉన్నారని అంటూ ఈ సమస్యలన్నీ గవర్నర్ కు వివరించామని తెలిపారు. గ్రామ పంచాయతీలుసహా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరామని, కేంద్ర నిధుల మళ్లింపు అంశాన్ని వివరించామని తెలిపారు.
ఇక, గౌరవెల్లి నిర్వాసితుల విషయానికొస్తే ఈ ప్రాజెక్టు 2007లో 1.4 టీఎంసీ నీటితో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, ఆనాడు భూములిచ్చినోళ్లకు పరిహారమే ఇప్పటికీ ఇవ్వలేదని సంజయ్ చెప్పారు. ఆ తరువాత రీడిజైన్ పేరుతో అంచనా పెంచి భూములు తీసుకున్నారని, ఆయా రైతులకూ నేటికీ పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.
భూ నిర్వాసితులందరినీ అన్ని విధాల ఆదుకున్నాకే ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాళ్లపై లాఠీలు ఝుళిపిస్తున్నారని, నీళ్లకు బదులుగా రైతుల రక్తాన్ని పారిస్తున్నరని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది నిర్వాసితులకు ఇంతవరకు ఇండ్లు ఇవ్వలేదని, స్థలాలివ్వలేదని తెలిపారు.
వాటి కోసం న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితుల ఇండ్లపై అర్ధరాత్రి వందలాది పోలీసులను పంపి ఇండ్లపై దాడులు చేయిస్తవా? మహిళలు, పిల్లలు, వ్రుద్దులని చూడకుండా విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయిస్తవా? అమ్మాయిల బట్టలు, బ్లౌజులు చింపుతూ రాక్షసానందం పొందుతవా? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.
గౌరవెల్లి బాధితులకు న్యాయం జరిగే వరకు, వారిపై దాడులకు పాల్పడ్డ పోలీసులు, టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దాకా బీజేపీ పోరాడుతుందని సంజయ్ స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో 8 వేల మంది విద్యార్థులు కనీస సౌకర్యాల్లేక అల్లాడుతున్నరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అక్కడ చదువుకునే వాళ్లంతా పేదోళ్లే. ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశతో వస్తే రాచి రంపాన పెట్టి విద్యార్థుల ఆశలను అడియాశలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాళ్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ అండగా ఉంటూ పోరాడుతుందని సంజయ్ ప్రకటించారు.